కాణిపాకం: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో వివిధ విభాగాలకు సంబంధించిన లైసెన్స్ హక్కుల వేలం ద్వారా భారీ ఆదాయం సమకూరింది. ఆలయ ఆస్థాన మండపంలో మంగళవారం ఆన్లైన్ టెండర్లు, సీల్డ్ టెండ ర్లు, బహిరంగ వేలం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. ఈ టెండర్ల ద్వారా దేవస్థానానికి మొత్తం రూ.1,75,58,998 (కోటి 75 లక్షల 58 వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు) ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఆదాయం వివరాలు
తలనీలాల సేకరణకు ఏడాది కాలపరిమితికి గాను తలనీలాలు పోగుచేసుకునే లైసెన్స్ హక్కు అత్యధికంగా రూ.91,89,999 పలికింది. బస్టాండ్ వద్ద క్యాంటీన్ నిర్వహణ లైసెన్స్ హక్కు ఏడాది కాలానికి రూ.37,08,999 ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఆల యం వెలుపల దూప్ స్టిక్స్, అగరబత్తీలు విక్రయించుకునే లైసెన్స్ హక్కు రూ.30,00,000లకు ఖరారైంది. శివాలయం గార్డెన్లో భక్తులకు ఫొటోలు తీసి ఇచ్చే లైసెన్స్ హక్కు ద్వారా రూ.15,00,000 వచ్చాయి. దేవస్థానానికి చెందిన పాత బొలెరో వాహనాన్ని బహిరంగ వేలం వేయగా రూ.1,60,000 ఆదాయం సమకూరింది. దేవస్థానం ఈవో పెంచలకిషోర్ సమక్షంలో నిర్వహించి ఈ వేలం పాటల కార్యక్రమంలో ఏఈవో ధనుంజయ, ఆలయ సూపరింటెండెంట్లు, ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.


