పుత్తూరు: పౌరుల ఓటు హక్కును పరిరక్షించడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మాజీ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. ఆమె సోమవారం జిల్లా అధ్యక్షుడు భరత్రెడ్డి, నియోజకవర్గ సర్ మానిటరింగ్ టీమ్ సభ్యుడు రవీంద్రతో కలిసి పుత్తూరు మండలం ఉత్తరపుకండ్రిగ పంచాయతీ కనకంపాళెం పోలింగ్ బూత్లో జరుగుతున్న స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని తెలిపారు. ఆ హక్కుకు భంగం కలిగించే ఏ చర్యనైనా వైఎస్సార్ సీపీ ప్రతిఘటిస్తుందన్నారు. సర్ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, అర్హులైన ఓటర్లకు అన్యాయం జరిగినా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ప్రజల నుంచి అందుతున్న అభ్యంతరాలు, ఓటరు జాబితాలో జరుగుతున్న మార్పులు, బీఎల్ఏలు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. భరత్రెడ్డి మాట్లాడుతూ ప్రతి బూత్లో పార్టీ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందని తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి తగిన చర్యలు చేపడతామని చెప్పారు. రవీంద్ర మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని చర్యలు జరుగుతున్నాయా అన్న అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మునివేలు, జయప్రకాష్, ఏకాంబరం, సురేష్రాజు, సర్ మానిటరింగ్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.


