ధరల దోపిడీపై చర్యలు తీసుకోవాలని వినతి లేకుంటే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక
డిమాండ్లు ఇవే
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులను ఆదుకోవాలని మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం సంఘం నాయకులతో కలిసి పీజీఆర్ఎస్లో జేసీ ఆదర్శ్ రాజేంద్రన్కు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో గుజ్జు ఫ్యాక్టరీలు, కొనుగోలు ర్యాంపులు సిండికేట్గా మారి అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. ధరలు పతనం కావడంతో 40 వేల మందికి పైగా రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2026 సంవత్సరానికి గాను తోతాపురి మామిడి ధరను ప్రభుత్వం కేజీకి రూ.7.50 లుగా ప్రకటించినప్పటికీ, జిల్లాలోని ఏ ఒక్క గుజ్జు ఫ్యాక్టరీ ఆ ధరను అమలు చేయడం లేదన్నారు. జూన్ 25వ తేదీ వరకు గుజ్జు ఫ్యాక్టరీల్లో కేజీ తోతాపురి ధరను రూ.6 చూపిస్తూ ధరల పట్టికలు పెట్టారని తెలిపారు. మూడు రోజులుగా రూ.5 ఇస్తామంటూ కొత్త బోర్డులు పెట్టారని తెలిపారు. ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయిన ర్యాంపుల్లో గత వారం కేజీ రూ.4 ఇవ్వగా, మూడు రోజులుగా జిల్లాలోని అన్ని ర్యాంపుల వద్ద కేజీ రూ.3 ఇస్తున్నట్టు పేర్కొన్నారు. మద్దతు ధర అమలు చేయని ర్యాంపులు, గుజ్జు ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మామిడి రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఉమాపతి నాయుడు, మునిరత్నం నాయుడు, హేమలత, చెంగల్రాయరెడ్డి, జయ దేవయ్య తో పాటు పలువురు మామిడి రైతులు పాల్గొన్నారు.
జేసీకి మామిడి రైతు సంఘం నాయకుల అర్జీ


