ఎమ్మెల్యే చెబితేనే ట్రాక్టర్లను పంపిస్తారా అంటూ వాగ్వాదం
దిగొచ్చిన అధికారులు
సిఫార్సుల వాహనాలను సీరియల్లో పెట్టించిన ఎస్ఐ, తహసీల్దార్
గుడిపాల: సిఫార్సులకు సంబంధించిన వాహనాలను పెద్ద సంఖ్యలో ఫ్యాక్టరీలోకి పంపడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్డుపై బైఠాయించారు. తాము వచ్చి రెండు రోజులు గడిచినా ఒక ట్రాక్టర్ కూడా అన్లోడింగ్ కావడం లేదని, ఎమ్మెల్యే సిఫార్సు అంటూ వాహనాలను తరలించడం దారుణమని మండిపడ్డారు. రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు చిత్తూరు–వేలూరు రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ రామ్మోహన్, తహసీల్దార్ శ్రీనివాసులు అక్కడికి చేరుకుని రైతులతో చర్చించారు. రైతులు మాట్లాడుతూ తాము రెండు, మూడురోజుల నుంచి ఇక్కడ పడిగాపులు పడుతున్నామని వాపోయారు. కొంతమంది తాము ఎమ్మెల్యే మనుషులమని చెప్పి ట్రాక్టర్లను నేరుగా ఫ్యాక్టరీలోపలికి తీసుకెళ్లిపోతున్నారని మండిపడ్డారు. ఎస్ఐ, తహసీల్దార్ మాట్లాడుతూ సిఫార్సులకు సంబంధించిన ట్రాక్టర్లను సీరియల్లో ఉంచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు.


