చిత్తూరు కార్పొరేషన్: దేశంలోనే మామిడి పంట, పాల ఉత్పత్తిలో చిత్తూరు జిల్లా ముందంజలో ఉందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. ఆయన శనివారం చిత్తూరులోని ఒక కల్యాణ మండపంలో నిర్వహించిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. గిట్టుబాటు ధరలు లేక మామి డి రైతులు అల్లాడుతున్నారని తెలిపారు. ఒకే రకమైన పంటను నమ్ముకుంటే నష్టాలు తప్పవన్నారు. ఇతర పంటలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు.
చిత్తూరు నుంచే గెలుపు ప్రారంభం కావాలి
‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. చిత్తూరు నుంచే గెలుపు ప్రారంభం కావాలి’ అని మాధవ్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన పెట్టుబడి సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది చివరిలోపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. జాలి, దయతో పార్టీలో పదవులు ఇస్తారేమో కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఫారం ఇవ్వరని, పెట్టుబడిని సమ కూర్చుకోవాలన్నారు. లేదా ఇచ్చేవారిని చూసుకోవా లని తెలిపారు. కేంద్రం నిధులతో పంచాయతీల వారీగా జరిగిన అభివృద్ది పనులపై ప్రచారానికి క్యూఆర్ కోడ్ విధానం అమలులోకి తెస్తామన్నారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాలో రోడ్డు మార్గం ఉహించని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు. త్వరలో రైల్వే డబ్లింగ్ పనులు ప్రారంభమవుతాయన్నారు. బీజేపీ చిత్తూరు సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం మాట్లాడుతూ తనకు చిత్తూరు నగరంలో 37వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని కోరుతూ మాధవ్కు వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు జగదీశ్వరనాయుడు, నిషిధరాజు, శ్రీనివాసులు, చిట్టిబాబు రామభద్ర, సత్య, రెడ్డిమస్తాన్ పాల్గొన్నారు.


