చిత్తూరు కలెక్టరేట్ : పీజీఆర్ఎస్ కార్యక్రమం అర్జీదారుల ఆవేదనలు, కన్నీటి గాథలతో పోటెత్తింది. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి బాధిత అర్జీదారులు న్యాయం కోసం తండోపతండాలుగా తరలివచ్చారు. పీజీఆర్ఎస్ భవనం ఎదుట గుంపులు, గుంపులుగా గంటల తరబడి నిరీక్షించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం వల్లే తాము ప్రతి వారం ఇంతదూరం వ్యయప్రయాసలకోర్చి రావాల్సి వస్తోందని అర్జీదారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ స్వయంగా పాల్గొని బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. అయితే కార్యాలయాల చుట్టూ తిరగడం మినహా తమ రాతలు మారడం లేదని పలువురు బాధితులు వాపోయారు. పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ స్థలం కోసం కాలనీవాసుల మొర
చిత్తూరులోని కట్టమంచి రోడ్డు, రఘురామ్ నగర్ కాలనీవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చి కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు. తమ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో తాము ఎంతో పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో కొలిచే సత్యమ్మ దేవాలయాన్ని తొలగించాలని అధికారులు నిర్ణయించారని ఆందోళన వ్యక్తంచేశారు. దేవాలయాన్ని పునర్నిర్మించడానికి తమ కాలనీలోనే అనువైన ప్రత్యామ్నాయ ప్రభుత్వ స్థలం కేటాయించాలని కోరారు.
ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కోరుతున్న కాలనీవాసులు
కలెక్టర్కు సమస్య మొరపెట్టుకుంటున్న అర్జీదారులు


