మామిడి రైతులకు సౌకర్యాలు
గంగాధర నెల్లూరు : గంగాధర నెల్లూరు మండలంలో మామిడి రైతుల అవస్థలపై సాక్షి దినపత్రికలో గత నాలుగు రోజులుగా వస్తున్న వరుస కథనాలకు జిల్లా యంత్రాంగం కదిలి వచ్చింది. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని జైన్ యూనిట్–1ను జీడీ నెల్లూరు తహసీల్దార్ సీకే శ్రీనివాసులుకు, యూనిట్–2 ఎంపీడీవో మనోహర్ గౌడ్కు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశాలు జారీచేశారు. మామిడి రైతులకు భోజన సదుపాయాలు, కూర్చోవడానికి కుర్చీలు, టెంట్ సదుపాయాలు వెంటనే కల్పించాలని ఆదేశించారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో జైన్ గుజ్జు పరిశ్రమలను సోమవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి సదుపాయాల కల్పిస్తామని తెలిపారు. మామిడి కాయల సీజన్ ముగిసేంతవరకు సదుపాయాలు కొనసాగిస్తామని తెలిపారు.


