నగరి: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ చాలా కీలకమని, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆమె శనివారం తన నివాస కార్యాలయంలో నగరి మున్సిపాలిటీకి చెందిన ముఖ్య నాయకులు, బూత్ ఏజెంట్లు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఆమె మాట్లాడుతూ ఎస్ఐఆర్పై ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలకు సరైన సమాచారం అందించే బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రతి బూత్కు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కోఆర్డినేటర్లు కార్యకర్తలను గుర్తించి వారి ఓటును కాపాడుకోవాలన్నారు. సరైన నివేదికలు సిద్ధం చేసి, ఒక్క ఓటు కూడా కోల్పోకుండా కాపాడుకోవాలని సూచించారు. అలాగే ప్రతి బూత్ స్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉండాలని, పార్టీకి నష్టం కలిగించే తప్పుడు ప్రచారాలను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం తీసుకోవాల్సిన భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ శ్రేణులు ఐక్యమత్యంగా పనిచేస్తే నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందన్నారు.


