సర్టిఫికెట్ల పరిశీలనలో అవకతవకలు
రిజర్వేషన్ అమలులో తప్పుల తడకలు
మెరిట్ కమ్ రిజర్వేషన్ విధానం
తుంగలోకి
డిస్టిక్ సెలక్షన్ కమిటీ అధికారాలన్నీ రాష్ట్ర స్థాయిలోనే
తీవ్రంగా నష్టపోయిన డీఎస్సీ
బాధిత అభ్యర్థులు
బాబు నాటకం..
చిత్తూరు కలెక్టరేట్ : ఉపాధ్యాయ కొలువుల భర్తీ కోసం చేపట్టిన మెగా డీఎస్సీ నిరుద్యోగుల పాలిట మెగా స్కామ్గా మారిందని బాధిత డీఎస్సీ అభ్య ర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. పారదర్శకతను పూర్తిగా పక్కనబెట్టి, అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. సర్టిఫికెట్ల పరిశీలన దగ్గర నుంచి రిజర్వేషన్ల అమలు వరకు ప్రతి అడుగులోనూ అవకతవకలు స్పష్టంగా కనిపిస్తుండడంతో.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని డీఎస్సీ బాధిత అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వేషన్ల అమలులో తప్పుల తడకలు
సామాజిక న్యాయం, రిజర్వేషన్ల అమలులో ఈ డీఎస్సీలో ఘోరమైన తప్పిదాలు జరిగాయి. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన అభ్యర్థుల హక్కులను కాలరాస్తూ.. రోస్టర్ పాయింట్ల విధానాన్ని ఇష్టారాజ్యంగా మార్చేశారు. మెరిట్ కమ్ రిజర్వేషన్ విధానానికి మంగళం పాడేశారు. మెరిట్ సాధించిన అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయాల్సి ఉండగా.. వారిని కూడా రిజర్వేషన్ కోటాలోనే నెట్టేసి, జనరల్ పోస్టులను ఇతరులకు కట్టబెట్టేలా అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో అర్హులైన ఎంతోమంది ప్రతిభావంతులు జాబితా నుంచి కనుమరుగయ్యారు.
డీఎస్సీ అధికారాలన్నీ రాష్ట్ర స్థాయిలోనే!
నిజానికి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) పేరులోనే జిల్లా స్థాయి అధికారాలు ఉంటాయి. కానీ ఈ ప్రక్రియలో జిల్లాల కలెక్టర్లు, స్థానిక విద్యాశాఖ అధికారుల అధికారాలన్నింటినీ రాష్ట్ర స్థాయిలోనే కేంద్రీకృతం చేసేశారు. జిల్లా కమిటీలను కేవలం రబ్బర్ స్టాంపులుగా మార్చేశారు. స్థానిక కోటా (లోకల్ స్టేటస్), అభ్యర్థుల స్థానికతను నిర్ధారించడంలో జిల్లా కమిటీల అభిప్రాయాలను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు.
అవి ఏ ఒక్కటీ అనుసరించలేదు
పారదర్శకతకు మారుపేరైన ఏపీపీఎస్సీ (ఏపీపీఎస్సీ) నిబంధనలను, గైడ్లైన్స్ను అనుసరించడం కనీస ధర్మం. కానీ ఈ డీఎస్సీలో వాటిని తుంగలో తొక్కారు. అభ్యర్థుల మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియలో కానీ, కట్–ఆఫ్ మార్కుల ప్రకటనలో కానీ ఎలాంటి పారదర్శకత లేదు. ఒకే పోస్టుకు విభిన్న పరీక్షల షిఫ్టుల నిర్వహణలో వచ్చిన మార్కుల వ్యత్యాసాలను సరిదిద్దే శాసీ్త్రయ విధానాన్ని పాటించకపోవడంతో వేలాది మంది నష్టపోయారు.
సర్టిఫికెట్ల పరిశీలనలో అలివిగాని అక్రమాలు!
సర్టిఫికెట్ల పరిశీలన (వెరిఫికేషన్) ప్రక్రియ పూర్తిగా ప్రహసనంగా మార్చేశారు. అర్హులైన మెరిట్ అభ్యర్థులను పక్కనబెట్టి, వెనుకబడిన వారికి, అనర్హులకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు సర్కారు తెర వెనుక పెద్ద నాటకమే నడిపించింది. ఓపెన్ కట్ ఆఫ్ వివరాలను, పూర్తి స్థాయి సెలక్షన్ లిస్టులను అధికారికంగా వెల్లడించకుండా.. కేవలం కొద్ది మందికి మాత్రమే రహస్యంగా సమాచారం పంపుతూ ఈ ప్రక్రియను కానిచ్చేశారు.


