పలమనేరు: ఆటోల్లో ప్రయాణిస్తే మనకు ఎలాంటి భయం లేదని జనం నమ్మితేనే వారికి డ్రైవర్లపై సంపూర్ణ విశ్వాసం ఉంటుందని, అందుకే జన విశ్వాస్ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నట్టు ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. ఆ మేరకు పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డివిజన్ పరిధిలోని ఆటో డ్రైవర్లతో జన విశ్వాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాజాత బృందం ఇందుకు సంబంధించిన చిన్న వయసులో పారిపోయి పెళ్లి చేసుకునే అమ్మాయి కథ థీమ్ను అద్భుతంగా ప్రదర్శించారు. అనంతరం ఆయన సేఫర్ త్రీవీలర్ రైడర్స్ క్యూఆర్కోడ్ వ్యవస్థను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తాము ఆటో డ్రైవర్లకు ఇచ్చే యూనిట్ ఐడీ ప్రత్యేక కోడ్ను కలిగి ఉంటుందన్నారు. దీన్ని ప్రయాణికులు స్కాన్ చేయడం ద్వారా డ్రైవర్ వివరాలన్నీ డిస్ప్లే అవుతాయన్నారు. ఆటోలో ఏదేని ఇబ్బంది కలిగితే వెంటనే ప్రయాణికుల భద్రతకు పోలీసులు గ్యారెంటీగా ఉంటారన్నారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ వ్యవస్థతో ఆటో డ్రైవర్లపై సమాజంలో నమ్మకం పెరుగుతుందన్నారు. ముఖ్యంగా తాము నిర్వహించే డ్రంక్అండ్ డ్రైవ్ టెస్ట్లలో ఏ ఆటో డ్రైవర్ దొరకలేదన్నారు. ఈ విషయంలో వారిని అభినందిస్తున్నామని తెలిపారు. ఏఎస్పీ తురుణ్పవ్హా, సీఐ మోహన్రెడ్డి, సబ్ డివిజన్లోని ఎస్లు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.


