చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా బాలభవన్ ఆధ్వర్యంలో స్థానిక కణ్ణన్ పాఠశాల ప్రాంగణంలో ఏప్రిల్ 25న ప్రారంభమైన వేసవి చిత్రలేఖన శిక్షణా శిబిరం గురువారం ముగిసింది. ఈ శిక్షణలో విద్యార్థులు లైన్ డ్రాయింగ్స్, పెన్సిల్ షేడ్స్, కలరింగ్ విధానాలు, పేపర్ కటింగ్స్, పేపర్ బొమ్మల తయారీ (క్రాఫ్ట్ వర్క్), రంగులు వేయడం తదితర అంశాలపై నైపుణ్యం సాధించారు. ఈ క్రమంలో పిల్లలు అద్భుతమైన చిత్రాలను గీసి ప్రదర్శనలో ఉంచారు. చిత్తూరు జిల్లా డీవైఈవో ఇందిర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రదర్శనను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు తమ మనస్సును ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి ఇలాంటి లలిత కళలను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. సృజనాత్మకతను పెంచే ఇలాంటి కోర్సుల్లో రాణించడం ద్వారా భవిష్యత్తులో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. విద్యార్థులు గీసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలభవన్ నిర్వాహకులు రామచంద్రారెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


