చిత్తూరు కార్పొరేషన్: పరిశ్రమలకు విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తామని ట్రాన్స్కో సీఎండీ శివశంకర్ స్పష్టం చేశారు. బుధవారం పారిశ్రామిక విద్యుత్ సదస్సు సందర్భంగా డిస్కం పరిధిలోని వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో సబ్స్టేషన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. గంగవరం మండలం గండ్రాజుపల్లి పారిశ్రామికవాడ నుంచి అల్లూరయ్య మాట్లాడుతూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
డీపీఓకు జాతీయ స్థాయి అవార్డు
చిత్తూరు కార్పొరేషన్: జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం అవార్డును డీపీఓ సుధాకర్రావ్, కుప్పం ఎంపీడీఓ వెంకటేశులు ఢిల్లీలో అందుకున్నారు. ఇటీవల కేంద్ర బృందం జిల్లాలో పర్యటించగా కుప్పంలోని నాయనూరు పంచాయతీను బ్లాక్గా గుర్తించి జాతీయ అవార్డును ప్రకటించింది. కుప్పం మండల ఖాతాకు రూ.1.5 కోట్ల నిధులు జమచేశారు. ఏప్రిల్ 23న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అవార్డును అందజేయాల్సి ఉండగా తమిళనాడు, వెస్ట్బెంగాల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆ కార్యక్రమం జరగలేదు. బుధవారం ఢిల్లీలో కేంద్ర పీఆర్ మంత్రి రాజీవ్రంజన్ సింగ్ చేతుల మీదుగా అవార్డును డీపీఓ, ఎంపీడీఓలకు ప్రదానం చేశారు.
చిత్తూరు అర్బన్: చిత్తూరు మీదుగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు దీక్షిత్ సుక్రిత్ (22), మురళీధర్ బురడీ (33) నుంచి 39.60 కిలోల గంజాయి బస్తాలు, ఓ కారు, రెండు నకిలీ నంబరు ప్లేట్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో నాన్–కేడర్ ఎస్పీ రాజశేఖర్రాజు, చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ ఇతర పోలీసు అధికారులతో మీడియా సమావేశం నిర్వహించారు. వీరు మాట్లాడుతూ.. మంగళవారం మధ్యాహ్నం తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిలోని యాదమరి మండలం వరిగిపల్లె కూడలి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఓ కారులో ప్రత్యేకంగా రూపొందించిన అరల్లో చిన్నపాటి బస్తాలుగా చుట్టిపెట్టిన గంజాయి కనిపించింది. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా, ఒడిశా నుంచి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్నట్లు.. బెంగళూరులో కిలో రూ.30 వేల వరకు విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు పశ్చిమ సీఐ శ్రీధర్ నాయుడు, యాదమరి ఎస్ఐ ఈశ్వరయ్య పాల్గొన్నారు.
పక్కాగా ‘ఎస్ఐఆర్’ సర్వే
చిత్తూరు అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను క్షేత్ర స్థాయిలో పక్కాగా నిర్వహించాలని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసులు, కమిషనర్ నరసింహప్రసాద్, తహసీల్దార్ కులశేఖర్తో కలిసి బూత్ లెవెల్ ఆఫీసర్లు, పర్యవేక్షకులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈనెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఇంటింటా ఓటర్ల తనిఖీ జరగాలన్నారు. ఎక్కడైనా తప్పిదం జరిగితే ఉపేక్షించేదిలేదన్నారు.


