కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బుధవారం సంకటహరచతుర్థి గణపత్రి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన ఆలయ అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం, సాయంత్రం శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతానిన జరిపించారు.
స్వర్ణరథంపై గణనాథుడు
స్వయంభు శ్రీకాణిపాక వరసిద్ధి వినాయకస్వామి రాత్రి ఆలయ మాడవీధుల్లో స్వర్ణరథంపై ఊరేగుతూ కటాక్షించారు. ప్రధాన ఆలయంలో సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవ విగ్రహాలకు ఆలయ అర్చక, వేద పండితులు ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను మేళతాళల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి స్వర్ణ రథంలో కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. ఎమ్మెల్యే మురళీమోహన్, ఏఈఓ రవీంద్ర పాల్గొన్నారు.


