చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో క్షయ (టీబీ) నివారణ కార్యక్రమాలను మరింత పటిష్టపరిచే లక్ష్యంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నాగశిభూషణరెడ్డి గురువారం చిత్తూరు జిల్లా టీబీ సెంటర్ను ఆకస్మికంగా సందర్శించారు. సందర్శనలో భాగంగా ఎక్స్రే గది, ల్యాబొరేటరీ, సీబీ–నాట్ విభాగం, డ్రగ్ స్టోర్లను పరిశీలించారు. టీబీ అనుమానితులకు రోగ నిర్ధారణ వేగవంతంగా జరిగేలా ఎక్స్రే, సీబీ–నాట్ పరీక్షలను సకాలంలో పూర్తి చేయాలని, ల్యాబ్ నివేదికలు ఆలస్యం కాకుండా అందించాలని సిబ్బందికి సూచించారు. డ్రగ్ స్టోర్లో క్షయ వ్యాధి నివారణ మందుల నిల్వలు, గడువు తేదీలు, పంపిణీ రికార్డులను పరిశీలించిన డీఎంహెచ్వో, మందుల కొరత తలెత్తకుండా తగిన నిల్వలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రిజిస్టర్ల నిర్వహణ క్రమబద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా క్షయ నివారణ అధికారి వెంకప్రసాద్తో పాటు డీఎల్టీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


