‘సర్‌’ వస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ వస్తున్నారు!

Jun 3 2026 12:15 AM | Updated on Jun 3 2026 12:15 AM

● 15 నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటింటా సర్వే ● స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌తో వివరాల సేకరణ ● 14 వరకు ప్రతి ఇంటా ఓటర్ల తనిఖీ ● బీఎల్‌ఏలను నియమించుకున్న పార్టీలు.. శిక్షణలు ● ఈనెల 5లోపు ఈసీకి జాబితా

చిత్తూరు అర్బన్‌: ప్రభుత్వాల ఏర్పాటు, నాయకులను ఎంచుకోవడంలో ఓటుకున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇదే సమయంలో ఓటరుగా సజీవంగా ఉన్న వ్యక్తికి ఓటుహక్కు లేకపోతే పెనుముప్పు ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే భారతీయ ఎన్నికల కమిషన్‌ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) పేరిట నూతన సంస్కరణను తీసుకొచ్చింది. జిల్లాలో ఈనెల నుంచి ప్రారంభంకానున్న ‘సర్‌’ను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అర్హుల ఓటర్లు చేజారిపోకుండా చూసుకుంటున్నాయి.

వారి సమ్మతే ప్రధానం

‘సర్‌’ కార్యక్రమంలో బూత్‌ లెవల్‌ ఏజెంట్లదే (బీఎస్‌ఏ) కీలక పాత్ర. బీఎల్‌ఎలు చేపట్టే ఇంటింటా సర్వేలో వారి సమ్మతే ప్రధానం. ఈ క్రమంలో ప్రతి రాజ కీయ పార్టీ బూత్‌ లెవల్‌ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉంది. లేని పక్షంలో ఓటరు జాబితాలోని తమ సానుభూతిపరులను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. జిల్లాలో 1,762 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. ఒక్కో బూత్‌కు ఒకరిని గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలు ఏజెంట్లుగా నియమించుకొని జాబితాను ఎన్నికల కమిన్‌కు అందజేయాలి. వీరికి జూన్‌ 5 నుంచి 14వ తేదీ వరకు సర్‌ సర్వే నిర్వహణపై శిక్షణ ఇవ్వసున్నారు.

చిన్న తేడా.., నష్టం పెద్దదే!

భారత ఎన్నికల కమిషన్‌ ప్రతి సంవత్సరం ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేస్తుంది. దీన్నే స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) అంటారు. ఇందులో భాగంగా ఓటరు జాబితాలో పేరున్నప్పటికీ చనిపోయిన వారిని తొలగించడం, 18 ఏళ్లు నిండిన వాళ్లను కొత్త ఓటరుగా చేర్చడం, ఓటరు ఓ చోటి నుంచి మరో చోటికి బదలాయిండం, అచ్చు తప్పులు సరిచేసుకోవడం, చిరునామాలు, నియోజకవర్గాల మార్పులకు ఎస్‌ఎస్‌ఆర్‌లో అవకాశం కల్పిస్తారు. ఇదే సమయంలో ఎస్‌ఐఆర్‌(సర్‌) జాబితాలోని ప్రతి ఓటరు ఎన్యుమరేషన్‌ ఫాం–2ను ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏమైనా మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. తద్వారా చనిపోయిన ఓటర్ల పేర్లు, డబుల్‌ ఓటర్లు(రెండు చోట్లా ఓటు ఉన్న వ్యక్తులు), కనిపించకుండాపోయిన ఓటర్లు, ఇంటి అడ్రస్సులు లేని వ్యక్తులు, భారత పౌరసత్వం లేని వ్యక్తులు పూర్తిగా ఓటరు జాబితాలో పేరును కోల్పోతారు. ఇలా ఉన్నజాబితాలో కనీసం 10 శాతం ఓటర్లు తొలగిపోయే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే బీఎల్‌ఏలను నియమించుకుని శిక్షణ కూడా ప్రారంభించింది. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరికీ అన్యాయం జరగకూడదని, ఫారం–2ను పూరించడంపై పెద్ద ఎత్తున శిక్షణ తరగతులు ప్రారంభించింది.

‘ఏజెంట్ల’తో బిజీబిజీ

జాతీయ ఎన్నికల కమిషన్‌ మూడో విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎస్‌ఐఆర్‌’కు శ్రీకారం చుట్టింది. చిత్తూరు జిల్లా యంత్రాంగం సర్‌ను పారదర్శకంగా అమలు చేయడా నికి చర్యలు చేపట్టింది. ఈక్రమంలో జిల్లాలో గుర్తింపు కలిగిన పార్టీలతో పలుమార్లు భేటీలు నిర్వహించి సూచనలు చేస్తోంది. ఇందులో వైఎస్‌ఆర్సీపీతో పాటు అధికార పార్టీలు ఇప్పటికే బూత్‌ లెవల్‌ ఏజెంట్లను నియమించేసుకుంది. మిగిలిన పార్టీలు వారికి పట్టున్న ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకుంటూ సానుభూతి ఓటర్లు చేజారకుండా చూసుకుంటున్నాయి. జూన్‌ 5 నుంచి 14వ తేదీ వరకు శిక్షణ రాజకీయ పార్టీలు బూతల వారీగా ఎంపిక చేసిన బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంటోంది.

జిల్లాలో ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రకారం ఓటర్లు ఇలా..

నియోజకవర్గం ఓటర్లు మొత్తం పురుషులు సీ్త్రలు ఇతరులు

పుంగనూరు 117130 121882 5 239017

నగరి 98442 104044 8 202494

జీడీ నెల్లూరు 102069 103307 4 205380

చిత్తూరు 98808 104312 31 203151

పూతలపట్టు 109027 112410 6 221443

పలమనేరు 132924 135611 1 268536

కుప్పం 112864 113599 18 226481

మొత్తం 771264 795165 73 1566502

Advertisement
 
Advertisement
Advertisement