బంగారుపాళెం : మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన గాలీవాన మామిడి రైతులకు తీరని నష్టం మిగి ల్చింది. ముఖ్యంగా రాగిమానుపెంట, వెలుతురుచేను, కీరమంద, బండ్లదొడ్డి తదితర గ్రామాల్లో మా మిడి తోటల్లో పెద్ద ఎత్తున కాయలు నేలరాలాయి. పంట చేతికి వచ్చే సమయంలో పెనుగాలులకు కాయ లు రాలిపోవడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లినట్టు బాధిత రైతులు వాపోతున్నారు. రాలిన మామిడి కాయలను శనివారం బంగారుపాళెం మామిడి మార్కెట్కు తీసుకువచ్చారు. వ్యాపారులు కిలో రూ.2లకు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఆ మొత్తం తోటల్లో కాయలు ఏరేందుకు కూలీల ఖర్చు, రవాణా ఖర్చులకు కూడా రావడంలేదని అంటున్నారు. ఈ ఏడాది మామిడికి మంచి ధర పలుకుతుందని ఆశలు పెట్టుకున్నామని, పెనుగాలులకు తీవ్రంగా నష్టపోయినట్టు ఆవే దన వ్యక్తంచేస్తున్నారు.
నేలకూలిన విద్యుత్ స్తంభాలు
చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్కో చిత్తూరు రూరల్ డివిజన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం కురిసిన గాలీవానకు పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని ఈఈ సురేష్ తెలిపారు. కార్వేటినగరం సెక్షన్లో 12, ఎస్ఆర్పురంలో 6, వెదురుకుప్పంలో 10, ఆవులకొండలో 1 స్తంభం మొత్తం డివిజన్ పరిధిలో 29 స్తంభాలు కూలిపోయినట్టు పేర్కొన్నారు. అలాగే 6 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు. దీంతో ట్రాన్స్కోకు రూ.2 లక్షల నష్టం వాటిందని తెలిపారు. సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారని తెలిపారు.


