చిత్తూరు అర్బన్ : నిత్యం ఒత్తిళ్ల మధ్య పనిచేసే పోలీసులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరముందని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఆయన శనివారం చిత్తూరు నగరంలోని ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో పునరుద్ధరించిన పోలీసు వ్యాయామశాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా లోని పోలీసులు ఈ వ్యాయామశాలను ఉపయోగించుకోవాలన్నారు. పోలీసులు ఫిట్గా ఉన్నప్పుడే పనులను సులభంగా పూర్తి చేస్తార ని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాన్–కేడర్ ఎస్పీ రాజశేఖర్రాజు, శిక్షణా ఐపీఎస్ తరుణ్ పహ్వ, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉదయ్కుమార్, ఏఆర్ ఏఎస్పీ దేవదాసు, ఇన్స్పెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు.
బావిలో పడి బాలుడి మృతి
ఐరాల: మండలంలోని వీఎస్.అగ్రహారంలో శనివారం వ్యవసాయ బావిలో పడి బాలుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. చిత్తూరు పట్టణం శంకరాయగుట్టకు చెందిన ఖాదర్బాషా కుమారుడు షరీఫ్(16) వీఎస్.అగ్రహారంలో తమ బంధువుల ఇంటిలో పుట్టిన రోజు వేడుకులకు వచ్చాడు. శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తన మామతో కలిసి సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయాడు. మామ సమాచారం ఇవ్వడంతో బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకుని బావిలో వెతికారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో పాతాళభైరవి సాయంతో షరీఫ్ మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం మృతదేహాన్ని చిత్తూరులోని వారి నివాసానికి తరలించారు. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


