పోలీసులకు చిక్కిన దొంగ..? | - | Sakshi
Sakshi News home page

పోలీసులకు చిక్కిన దొంగ..?

May 30 2026 12:17 AM | Updated on May 30 2026 12:17 AM

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు నగరంలోని నాయుడు బిల్డింగ్స్‌లో జరిగిన చోరీ కేసులో దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం కిరణ్‌ అనే వ్యక్తి ఇంటి తలుపులు పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తి 200 గ్రాముల బంగారు, 3.500 కిలోల వెండి ఆభరణాలు చోరీ చేశాడు. వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి తిరుపతికి చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.

గొర్రెల దొంగకు దేహశుద్ధి

కుప్పం రూరల్‌ : కుప్పం మండలం మల్లానూరు గ్రామస్తులు శుక్రవారం గొర్రెల దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం మేరకు.. కుప్పం మండలం మల్లానూరు గ్రామం చుట్టు పక్కల ఇటీవల పదుల సంఖ్యంలో గొర్రెలు మాయమవుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారు బెంగళూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు దొంగలు మల్లానూరు పీహెచ్‌సీ ఎదురుగా గొర్రెలను అపహరిస్తుండగా గ్రామస్తులు గమనించారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో ఒక దొంగ తప్పించుకున్నాడు. మరో దొంగ మురుగేష్‌ గ్రామస్తులకు పట్టుబడ్డాడు. గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

శ్రీవారి దర్శనానికి

20 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 74,569 మంది స్వామిని దర్శించుకున్నారు. 46,292 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.15 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 20 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

ఎస్వీయూలో

నకిలీ రసీదుల కుంభకోణం

తిరుపతి క్రైమ్‌: ఎస్వీయూలో పరీక్ష ఫీజుల వ్యవహారంలో నకిలీ రసీదుల కుంభకోణం వెలుగుచూసింది. ఈ ఘటనలో రూ.65,686 మేర అవకతవకలు జరిగినట్లు తేలింది. ఎస్వీయూ క్యాంపస్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.రామకృష్ణ మాట్లాడుతూ ఎస్వీయూ రిజిస్ట్రార్‌ ఎం.భూపతినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు తెలిపారు. 2026 జనవరి నుంచి మే 27 వరకు పరీక్షా సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన ఫీజుల విషయంలో మొత్తం 27 నకిలీ రసీదులు సృష్టించినట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తేలిందన్నారు. ఎంకై ్వరీ కౌంటర్‌లో పనిచేస్తున్న చిరంజీవి నాయక్‌ ప్రత్యక్ష ప్రమేయం ఉందని, జియాలజీ విభాగంలో అకడమిక్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న శంకర్కు పరోక్షంగా సంబంధం ఉన్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement