సెక్టోరల్ అధికారుల రీ ప్యాట్రేషన్ నియామకాల్లో అవకతవకలు నిబంధనలకు పాతర రాజకీయ జోక్యంతో అనుకూలమైన స్కూళ్లకు యత్నాలు జిల్లా సమగ్రశిక్ష, విద్యాశాఖ కార్యాలయాల్లో వింత ధోరణి కలెక్టర్ దృష్టి సారించాలని సంఘం నాయకులు డిమాండ్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్రశిక్ష శాఖ, విద్యా శాఖ కార్యాలయాల వేదికగా వింత ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో సెక్టోరల్ అధికారులుగా సేవలందిస్తూ డెప్యుటేషన్ గడువు ముగిసిన ముగ్గురు టీచర్లను రీ ప్యాట్రేషన్(గతంలో పనిచేసిన పాఠశాలకు) పంపే విషయంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నిబంధనలను పక్కనబెట్టి తెరవెనుక కుతంత్రాలతో అనుకూలమైన చోట పోస్టింగ్స్ దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
స్పష్టమైన ఉత్తర్వులు ఇవే!
సమగ్రశిక్ష శాఖలో డెప్యుటేషన్ ముగించుకుని తిరిగి మాతృసంస్థ (విద్యాశాఖ)కు వచ్చే టీచర్ల నియామకాలపై రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఉత్తర్వులు జారీచేశారు. ఆ అధికారి గతంలో ఏ పాఠశా ల నుంచి వచ్చారో ఆ పాఠశాలలో ఖాళీ ఉంటే అక్కడే పోస్టింగ్ ఇవ్వాలి. అక్కడ ఖాళీ లేకపోతే అదే మండలంలోని ఇతర పాఠశాలల్లో ఖాళీలను పరిశీలించాలి. మండలంలో సైతం ఖాళీలు లేకపోతే పక్క మండలంలో టీచర్లు గతంలో పనిచేసిన హెచ్ఆర్ఏ ప్రకారం నియామకాలు చేపట్టాలి. సమగ్రశిక్ష శాఖ, విద్యాశాఖ అధికారులు నిబంధనలకు విరు ద్ధంగా వ్యవహరిస్తూ వారిని పాత పాఠశాలలకు కాకుండా పట్టణ, హెచ్ఆర్ఏ ఎక్కువ ఉన్న, అనుకూలమైన ప్రాంతాల్లోని పాఠశాలల్లో పోస్టింగ్స్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ఒక అధికారి సహకరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికితోడు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు జోక్యం కూడా ఉన్నట్టు సమాచారం. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఘోరంగా తయా రైంది. ఈ పరిస్థితుల్లో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో (గతంలో పనిచేసిన) ప్రాంతాల్లో పోస్టింగ్స్ ఇవ్వకుండా కుట్రలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.


