● వైఎస్సార్సీపీ బీసీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్వజం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీడీపీకి చెందిన శాప్ చైర్మన్ రవినాయుడు తన స్వలాభం కోసం పెదల బతుకులతో చెలగాటమాడుతున్నారని వైఎస్సార్సీపీ బీసీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసూయాదవ్ మండిపడ్డారు. బుధవారం ఆయన స్థానిక ప్రెస్క్లబ్లో బాధితులతో కలసి మీడియాతో మాట్లాడారు. అలిపిరి గరుడ సర్కిల్ వద్ద రవినాయుడు తనకు సంబంధించిన అరకు వ్యాలీ కాఫీ షాప్ను మరింతగా విస్తరించే క్రమంలో తోపుడు బండ్ల చిరు వ్యాపారులను నాలుగు రోజుల కిందట తొలగించడంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. తిరుపతి అలిపిరి జూపార్కు రోడ్డులో తోపుడుబండ్ల వ్యాపారస్తులు గత పదేళ్లుగా వ్యాపారం చేసుకుని జీవనోపాధి పొందుతున్నారని, ఉన్న ఫలంగా తోపుడుబండ్లను తొలగించడంతో వారు జీవనాధారాన్ని కోల్పోయి రోడ్డున పడ్డారని వాపోయారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తోపుడుబండ్ల వ్యాపారస్తులకు అక్కడే షాపులు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మల్లం రవికుమార్రెడ్డి, పార్టీ జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షులు అనిల్రెడ్డి, అలిపిరి తోపుడుబండ్ల బాధితులు పాల్గొన్నారు.
‘చిరుతపులి సంచారం లేదు’
గంగవరం: ఏదో జంతువు కాలి అడుగులను చూసి చిరుత పులి సంచారం అంటూ మండల ప్రజలు బుధవారం భయాందోళనకు గురయ్యారు. మండలంలోని నల్లసానిపల్లి గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలో జంతువు కాలి అడుగులు ఉన్న విషయాన్ని గ్రామస్తులు గుర్తించారు. అవి చిరుతపులివి అని పుకార్లు వ్యాపించాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయందోళనకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సెక్షన్ ఆఫీసర్లు సుకుమార్, రమేష్, అటవీ శాఖ సిబ్బంది నల్లసానిపల్లి వద్దనున్న మామిడితోపులో ఉన్న జంతువు కాలి అడుగులను పరిశీలించారు. అడుగులు పడిన చోట నేలపై గోర్లు కిందికి దిగినట్టు గుర్తించారు. సాధారణంగా పులి అడుగులైతే కాలి గోర్లు కిందికి దిగవని, అవి అడవి కుక్క అడుగులు అని నిర్ధారించారు. భయాందోళన చెందొద్దని, ఈ ప్రదేశంలో ఎక్కడా పులి సంచారం లేదని తేల్చి చెప్పారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.


