తిరుపతి రూరల్: డీఎస్సీ–2025 నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలతో కలిసి ఈ నెల 29న ధర్నా చేపడు తున్నట్టు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగే ధర్నాకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నేతలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ అనాలోచిత నిర్ణయాల వల్ల డీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో అర్హులైన వారికి న్యాయం జరగలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని, గవర్నర్ ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
బాలికపై అఘాయిత్యం
వరదయ్యపాళెం: మండలంలోని రాచకండ్రిగలో బాలిక(16)పై అదే ఊరికి చెందిన 46 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి తెగబడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు కాతరి వెంకటరమణయ్య (46) మేకల మందతో అడవికి వెళ్తుండేవాడు. బాలిక కూడా మేకలు మేపుకునేందుకు వెళ్లేది. ఒంటరిగా ఉన్న ఆమెకు వెంకటరమణయ్య మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చింది. ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీసిటీ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి సత్యవేడు కోర్టులో హాజరుపరికి రిమాండ్కు తరలించారు. బాలికను శ్రీసిటీ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.


