లా అండ్ ఆర్డర్ వ్యవస్థతో కక్షసాధింపులు
పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కాపాడి, ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసు వ్యవస్థను చంద్రబాబు, లోకేష్ రాజకీయ కక్షల కోసం వినియోగించుకోవడం విచిత్రమైన, విష పరిణామమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి నారాయణస్వామితో కలిసి తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్ఆర్ సీపీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తన ఇల్లు, ఆఫీసుపై సాయంత్రం 5 నుంచి 12 గంటల వరకు దాడి జరుగుతూనే ఉన్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపించారు. దాడి అంటే అలాంటి ఇలాంటి దాడి కాదన్నారు. ఈ దాడులకు ముందే పోలీసులు తన ఇంటి వద్దకు చేరుకున్నారని తెలిపారు. జిల్లా ఎస్పీ కనీసం పట్టించుకోలేదన్నారు. ఘటన విషయమై తమ పార్టీ నాయకులు జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారని, నేరుగా కూడా కలిశారని వివరించారు. ఆ తర్వాత ఘటనా స్థలానికి వచ్చినా చంద్రబాబు, లోకేష్ నుంచి ఫోన్ రావడంతో వెళ్లిపోయారని తెలిపారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు, వైవిధ్యాలు ఉంటాయి కానీ.. పోలీసులను చంద్రబాబు ఏ విధంగా ఉపయోగిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజలు పార్టీలకు అతీతంగా ఆలోచించాలని కోరుతున్నానన్నారు. తనపై, తన ఇంటిపై దాడి ఘటనపై బీజేపీ విష్ణుకుమార్ రాజు, సీపీఐ నారాయణ, జనసేన పార్టీ నాయకులు కూడా స్పందించారన్నారు. పార్టీలకు అతీతంగా తనను అరెస్ట్ చేసిన విషయంపై స్పందించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాత్రం స్పందించలేదని తెలియజేశారు.
శ్రీవారి కోపాగ్నికి బలికాక తప్పదు
తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కమిటీ ఈ విషయంపై విచారణ చేస్తోందన్నారు. ఛార్జిషీట్ ఫైల్ చేశాక తొందర ఎందుకని, అందులో వాస్తవాలు చెప్పారన్నారు. కల్తీ జరగకపోయినా జరిగినట్టు, వైఎస్ జగన్మోహన్రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దగ్గరుండి కల్తీ చేసినట్లు ప్రచారం చేయడం దారుణం అన్నారు. కల్తీ జరిగిందా లేదా అనే విషయాలు ప్రజలు గమనిస్తున్నారు, ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో లడ్డూ సమస్య తప్ప మరే సమస్యలు లేవా అని ప్రశ్నించారు. భగవంతుడిని అడ్డంపెట్టు కుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీవెంకటేశ్వర స్వామి కోపాగ్నికి బలికాక తప్పదని చంద్రబాబుని హెచ్చరించారు.


