ఘనంగా గాయత్రి మహాయజ్ఞం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరులోని తపోవనంలో ఆదివారం సిద్ధ సమాధి యోగ చిత్తూరు శాఖ తరపున యోగాచార్యులు నరేంద్ర కుమార్ శ్రీ గాయత్రి మహాయజ్ఞం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గాయత్రి పరివార్కు చెందిన గురురాజారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 150 మంది దంపతులు 36 యజ్ఞ కుండాలతో హాజరయ్యారు. సుమారు 500 మంది భక్తులు కలశాలు తీసుకుని గంగినేని చెరువు చిల్డ్రన్ పార్క్ సమీపంలోని అమ్మవారి ఆలయం నుంచి గాయత్రి మంత్రోచ్ఛరణలతో శోభాయాత్రగా తపోవనానికి చేరుకున్నారు. అనంతరం శాస్త్రోక్తంగా మహా యజ్ఞం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో గాయత్రి మంత్ర జపాన్ని అలవాటు చేసుకోవాలని యోగాచార్యులు నరేంద్ర కుమార్ సూచించారు.


