టీటీడీ అభివృద్ధి ఘనత వైఎస్సార్దే
శ్రీరంగరాజపురం : శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు దివంగత నేత , మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ కాదా.. అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్నించారు. ఈ సందర్భంగా మండలంలో ములూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి అబద్ధాలకోరు ఈ ప్రపంచంలో ఎవరూ లేరన్నారు. తిరుమల కొండలను చంద్రబాబు రెండు కొండలని చెప్పడంతో అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో డాక్టర్ వైఎస్సార్, 2 జూన్ 2007 సంవత్సరంలో జీఓ నంబర్ 746, 747లో రెండు కొండలు కాదు.. ఏడు కొండలని గుర్తిస్తూ జీఓ విడుదల చేశారన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధం అంటూ జీఓ ఇచ్చింది కూడా వైఎస్సార్ అని గుర్తు చేశారు. వీటిని జీర్ణించుకోలేని చంద్రబాబు అప్పటి ఎన్నికల ప్రచారంలో ఓట్ల కోసం క్రైస్తవ సభలో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ ఇచ్చిన ఆ జీఓలను రద్దు చేస్తానని చెప్పలేదా బాబు అని ప్రశ్నించారు. అలాగే స్వామి సేవలు, మహిమలు ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో జులై 7, 2008లో ఎస్వీబీసీ భక్తి ఛానల్ పెట్టడం జరిగిందన్నారు. అప్పుడు ప్రతిపక్షం హోదాలో ఉన్న చంద్రబాబు ఇన్ని కోట్లు పెట్టి భక్తి ఛానల్ పెట్టడం అవసరమా? అంటూ హేళన చేయడం ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. నేడు శ్రీవారి లడ్డూపై దుష్పృచారం చేస్తున్నది కూడా చంద్రబాబేనని ఆయన మండిపడ్డారు.


