
కాణిపాకం : జిల్లాలో మామిడి విపత్తు ఎదురవుతోంది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. పంట పక్వానికి వచ్చినా కోతలు కోయలేక కన్నీళ్లు పెడుతున్నారు. ఫ్యాక్టరీలు ముఖం చాటేస్తున్నాయి. ర్యాంపులు ఇదే దారిలో పయనిస్తూ... కాయలను కొనలేమని చేతులెత్తేస్తున్నాయి. టోకెన్లు గడువు ఉన్నంత వరకు కాయలకు గడువులేదని... ప్రభుత్వం ప్రోత్సాహక నిధి ప్రకటించి రైతుల గోసను గాలికొదిలేసిందని రైతులు ఆక్రోశానికి గురవుతున్నారు.
టోకెన్ ఉన్న రైతుల పరిస్థితి ఇదీ..
మామిడి రైతులు పండించిన పంట విక్రయానికి జిల్లాలోని ఫ్యాక్టరీల వద్దకు పోటెత్తుతున్నారు. వేల మంది రైతులు ఒక్కసారిగా ఫ్యాక్టరీలను ముట్టడిస్తున్నారు. ఈపోరు పడలేక ఫ్యాక్టరీలు, అధికారులు కలిసి వచ్చిన వారి అందరికీ టోకెన్లు పంచిపెట్టేస్తున్నారు. ఈ టోకెన్ల జారీ జూన్ నెల దాటింది. పలు ఫ్యాక్టరీలు జులై నెల ఆఖరు వరకు కొనుగోలు చేస్తామని టోకెన్లు ఇచ్చేసింది. మరో వారం..పది రోజుల్లో మామిడి పంట పూర్తిగా నేల మట్టమయ్యే అవకాశం ఉందని రైతులు కంట తడి పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో జులై నెల ఆఖరు వరకు పంట ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాయ పండై...పురుగు పట్టి రాలిపోవడం ఖాయమని కన్నీళ్లు కారుస్తున్నారు. ఇప్పటి వరకు 30 శాతం వరకు మాత్రమే పంట అమ్ముడుబోయినట్లు రైతులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలకు వచ్చిన సగం కాయలు తమిళనాడు కాయలని, వాటిని కూడా అధికారులు ఈ లెక్కల్లోనే కలిపేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
నష్టపరిహారం ఇవ్వాల్సిందే...
మామిడి పంటను కోసి అమ్ముకునే పరిస్థితి లేదని రైతులు దిగాలు చెందుతున్నారు. ఫ్యాక్టరీలు జిల్లా మామిడిని తోసి పుచ్చుతున్నాయంటూ గోల చేస్తున్నారు. సిఫార్సులకు పెద్దపీట వేస్తూ...సామాన్య రైతు కష్టాన్ని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీల వద్ద ఇబ్బంది పడుతోంది... సామాన్య రైతులేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం కొనాలంటే..మాకేమి లాభమని..ఫ్యాక్టరీలు పక్క రాష్ట్రాల కాయలపై మొగ్గు చూపుతున్నాయంటూ ఆగ్రహానికి గురవుతున్నారు. ఫ్యాక్టరీలు రూ.5, రూ.6ను కూడా తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో ప్రోత్సాహక నిధిని పక్కన పెట్టి మామిడి కష్టాలను విపత్తుగా గుర్తించి రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించి ఆదుకోవాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
2018 నష్టాలు గుర్తుకొస్తున్నాయి..
ప్రస్తుతం మామిడి పరిస్థితి చూసి రైతులు 2018 మామిడి సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 శాతం పంట మాత్రమే వచ్చింది. ఆ పంటను విక్రయించుకోవడానికి అప్పటి రైతులు నానా అవస్థలు పడ్డారు. ఆ సమయంలో ఫ్యాక్టరీలు మామిడి పంటను కొనలేని పరిస్థితి ఏర్పడితే రైతులు పండిన తోతాపురి కాయలను తీసుకొచ్చి కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై పోసి నిరసనకు దిగారు. చివరకు కేజీ తోతాపురి రూ.2 వరకు పలికింది. అప్పటి కూడా కొనలేని పరిస్థితులు ఉంటే 30శాతం నుంచి 40శాతం పంట చెట్లల్లోనే రాలిపోయాయి. కాగా అప్పట్లో ఫ్యాక్టరీలకు 20,053 మంది రైతులు 1,04,777 టన్నుల కాయలను విక్రయించారు. ఇందుకు గాను ఫ్యాక్టరీలు రూ.78.58 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉంటే 8 నెలల తర్వాత బిల్లులు చెల్లించాయి. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నిధి రూ.2.50 చొప్పున రూ.2.19 కోట్ల నిధులు చెల్లింపుల్లో జాప్యం చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా రైతులు అప్పులు చేసి తీవ్రంగా నష్టపోయారు. మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురు కావడంతో రైతుల్లో గుబులు పట్టుకుంటోంది.
నష్ట పరిహారం ఇవ్వాలి
ఈసారి మామిడి రైతు నిండా నష్టపోయాడు. మామిడి సా గు ఖర్చులు, కూలీల ఖర్చు లు, ట్రాక్టర్ ఖర్చులు కలిసి రై తులను ముంచేస్తున్నాయి. కా యలు తీసుకొచ్చేందుకు ట్రాక్టర్కు ఒక్క రోజుకు రూ.1000 బాడుగ ఇస్తున్నాం. బండి మూడు రోజు లు ఇక్కడే ఉంది. రోజుకు రూ.1000 చొప్పున మూ డు రోజులకు రూ.3 వేలు ఇవ్వాలి. కోసి తీసుకొచ్చింది కొంత వరకు మాత్రమే. మిగిలిన కాయలు చెట్లల్లో అలానే ఉన్నాయి. జులై వరకు టోకెన్లు ఇస్తున్నా. అ ప్పటి వరకు చెట్లల్లో కాయలు ఉండవు. నష్టపరిహా రం ఇచ్చి ఆదుకోవాలి. – వెంకటేష్, పెనుమూరు
చేతులెత్తేసిన ర్యాంపులు
జిల్లాలో ఇప్పటి వరకు 23 ర్యాంపులు నడుస్తున్నాయి. ఈ ర్యాంపులకు రోజువారీగా ఒక్క లారీ నుంచి రెండు లారీలా వరకు ఫ్యాక్టరీలకు అమ్ముకోవడానికి అనుమతులున్నాయి. ఈ ర్యాంపును నిర్వర్తించే వ్యాపారులు సొంత కాయలు, బంధువులు, తెలిసినా వాళ్ల మామిడి కాయలు అమ్ముకోవడానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగిలిన రైతుల మామిడిని కొనలేమని, ఫ్యాక్టరీ వాళ్లు తీసుకోవడం లేదని తలుపులు వేసేస్తున్నారు. ర్యాంపులకు వెళ్లిన రైతులకు వారం తర్వాతే కాయలు కొంటామని చెప్పేస్తున్నారు. అధికారులు చెప్పిన రేటు (రూ.3.50) కుదరదని, రూ.3 నని, మరో వారం తర్వాత ఆ రేటు చెప్పలేమని రైతులకు సమాధానమిస్తున్నారు. దీంతో మామిడి రైతులు తల్లడిల్లిపోతున్నారు.
ఒక్క టోకెన్ స్వామీ !
జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. ఫలంపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తోటలోని కాయలు మట్టిపాలవుతున్నాయి. రైతులు ఫలం పరిస్థితి చూసి కన్నీళ్లు కారుస్తున్నారు. చాలా మంది కాయలను అమ్ముకోవడానికి ఫ్యాక్టరీల వద్దకు పరుగులు పెడుతున్నారు. వారి అనుమతి కోసం బంగారుపాళ్యం, చిత్తూరు, గుడిపాల, పెనుమూరు, పూతలపట్టు, తవణంపల్లి, జీడీ నెల్లూరు తదితర ప్రాంతాలకు తిరిగేస్తున్నారు. తెలిసిన వ్యక్తులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు, కూటమి నేతలు, పలుశాఖ అధికారుల ద్వారా టోకెన్ల కోసం బతిమిలాడుకుంటున్నారు. ఒక్క టోకెన్ అయినా తీసి ఇవ్వు స్వామీ అంటూ రైతులు వారిని ప్రాధేయపడుతున్నారు.