
చదువు‘కొన’లేం!
● ఫీజుల పేరుతో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ ● ఖాళీ అవుతున్న సామాన్యుల జేబులు ● నోటీసు బోర్డుల్లో ప్రదర్శించని ఫీజుల వివరాలు ● కూటమి పాలనలో జాడలేని ఫీజు నియంత్రణ కమిటీలు ● పర్యవేక్షణలో విద్యాశాఖ అధికారులు విఫలం
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థుల వివరాలు
ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు 31,922
ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులు 11,750
ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు 29,303
ప్రాథమిక, హైస్కూల్ ప్లస్
పాఠశాలల్లో విద్యార్థులు 5,929
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.8 వేలు, మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో రూ.10 వేలు, జిల్లా కేంద్రంలో రూ.13 వేలు చొప్పున ఫీజులు నిర్ధారించారు. అయితే 4, 5 తరగతులకు గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.9 వేలు, పట్టణాల్లో రూ.11 వేలు, జిల్లా కేంద్రంలో రూ.13 వేలు, ఆరో తరగతికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.11 వేలు, మండల కేంద్రాల్లో 15 వేలు, పట్టణాల్లో రూ.17 వేలు సంబంధిత పాఠశాలల స్టార్ రేటింగ్ మేరకు ఫీజులను నిర్ణయించి అడ్డగోలుగా దోచుకుంటున్నారు.
వైఎస్సార్సీపీ హయాంలో ఫీజుల నియంత్రణ
కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులపై అధ్యయం చేసేందుకు ఐఏఎస్ అధికారులతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫీజు నియంత్రణ కమిటీలను నియమించింది. ఏ పాఠశాలలో ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ప్రాంతాల వారీగా ఈ కమిటీ పరిశీలించి నివేదిక రూపొందిం ప్రభుత్వానికి అందజేసేది. ఆ నివేదికల ఆధారంగా అధిక ఫీజులు వసూలు చేసే కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకునేవారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని గ్రామాలు, పట్టణాల్లో పాఠశాలలను ఐదు కేటగిరీలుగా విభజించారు. స్టార్ రేటింగ్ స్కూల్స్కు 1 నుంచి 10 వ తరగతి వరకు ఫీజులు సైతం ఫీజు నియంత్రణ కమిటీ సిఫార్సు చేసింది.
నిబంధనలకు తూట్లు
జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. ఫీజు వసూళ్లు, సౌకర్యాల వంటి వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. అయితే ఈ నిబంధనలను ప్రైవేట్ పాఠశాలలు పాటించడం లేదు. సిలబస్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముద్రించే పుస్తకాలను బోధించాలి. కానీ కొన్ని పాఠశాలల్లో ఒక్కొక్క పబ్లికేషన్ పుస్తకాలను ఐటీఐ ఒరియెంటెడ్ పేరుతో విక్రయిస్తూ వాటినే బోధిస్తున్నారు. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఇంటర్ స్థాయిలో ఉండే సిలబస్ను జోడించి సొంతంగా పుస్తకాలను విక్రయిస్తున్నారు. నిబంధనలు పాటించని పాఠశాలలను విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఇప్పటికై నా స్పందించి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల వివరాలు
ప్రాథమిక పాఠశాలలు 166
ప్రాథమికోన్నత పాఠశాలలు 79
ఉన్నత పాఠశాలలు 159
ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు 18
ప్రాథమిక, హైస్కూల్ ప్లస్ పాఠశాలలు 06
మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు
విద్యాశాఖ అధికారులు ఫీజుల నియంత్రణపై ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. తనిఖీలు చేయాల్సిన విద్యాశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఫలితంగా కూటమి ప్రభుత్వంలో సామాన్యులు నష్టపోతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు స్పందించి అధిక ఫీజుల దందాను అరికట్టాలి. – ప్రవీణ్,
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి

చదువు‘కొన’లేం!