గ్రా‘నైట్‌’..రైట్‌రైట్‌! | - | Sakshi
Sakshi News home page

గ్రా‘నైట్‌’..రైట్‌రైట్‌!

Jun 20 2025 5:49 AM | Updated on Jun 20 2025 5:49 AM

గ్రా‘

గ్రా‘నైట్‌’..రైట్‌రైట్‌!

ఫ్యాక్టరీల వద్ద కూటమి నేతల రౌడీ మామూళ్లు
● ఒక్కో బ్లేడ్‌కు రూ.35 వేల చొప్పున.. నెలకు రూ.10 కోట్లు వసూలు ● కప్పం కట్టకుంటే.. మైన్స్‌, విజిలెన్స్‌ దాడులు ● అంతా తెలిసినా పట్టనట్టు వ్యవహరిస్తున్న యంత్రాంగం

చిత్తూరు అర్బన్‌: భూగర్భ గనులశాఖ (మైన్స్‌) పరిపాలన జిల్లాలో పూర్తిగా గాడి తప్పింది. సహజ ఖనిజాలను తవ్వుకున్నప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీనరేజ్‌ (ఖనిజాల రాయల్టీ) రుసుములను వసూలు చేయాల్సిన గనులశాఖ చేతులు పైకెత్తేసింది. అధికార పార్టీకి చెందిన నాయకులు గత ఐదు నెలలుగా ఫ్యాక్టరీల నుంచి దౌర్జన్యంగా సీనరేజ్‌ వసూలు చేసుకుంటుంటే వేడుక చూస్తోంది. కూటమి నేతలు వేసే బిస్కట్లకు ఆశపడ్డ కొందరు అధికారులు.. ప్రభుత్వ ఖజానాకు జమకావాల్సిన రూ.కోట్ల సొమ్మును నేతల జేబుల్లోకి మళ్లిం చేయడం విమర్శలకు తావిస్తోంది.

రౌడీ మామూళ్లు

చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో గ్రానైట్‌ ఖనిజాలు విస్తారంగా ఉన్నాయి. క్వారీల రూపంలో వీటిని దక్కించుకున్న వ్యక్తులు భూగర్భ గనులశాఖ పర్యవేక్షణలో గ్రానైట్‌ రాళ్లను తవ్వి, వాటిని ఫ్యాక్టరీల్లో కట్‌ చేయించి, పాలిష్‌ వేసి, ఆపై విక్రయిస్తుంటారు. ఈ వ్యాపారం చేయడానికి వ్యాపారులు క్యూబిక్‌ మీటరు గ్రానైట్‌కు వాటి రంగు ఆధారంగా స్లాబ్‌ పద్ధతుల్లో ప్రభుత్వానికి సీనరేజ్‌ రుసుములను చెల్లించాలి. రాఘవ కన్‌స్ట్రక్చన్స్‌ అనే కంపెనీ ఫ్యాక్టరీల నుంచి రుసుములు చెల్లించే కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీతో ఈ కంపెనీకి రుసుములు వసూలు చేసుకునే కాల పరిమితి ముగిసింది. ప్రైవేటు కంపెనీ స్థానంలో మైన్స్‌ శాఖ, ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను వ్యాపారుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. కానీ గత ఐదు నెలలుగా రుసుముల వసూళ్ల నుంచి మైన్స్‌ అధికారులను పక్కకు తోసేసిన కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు.. ఫ్యాక్టరీల నుంచి నెల నెలా బెదిరించి, బలవంతంగా రౌడీ మామూళ్లు వసూలుచేసి వారి జేబుల్లో వేసుకుంటున్నారు.

ఇష్టారాజ్యం

కొందరు క్వారీ యజమానులు గ్రానైట్‌ ఖనిజాన్ని దోచుకుంటున్నారు. నిర్ణయించిన దానికంటే భారీ మొత్తంలో గ్రానైట్‌ వెలికితీసి, అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నారు. ప్రధానంగా రాత్రి 11 గంటలు దాటితే చిత్తూరు, కుప్పం, గంగాధరనెల్లూరు ప్రాంతాల నుంచి భారీ వాహనాల్లో గ్రానైట్‌ స్మగ్లింగ్‌ జరుగుతోంది. చిత్తూరుకు చెందిన ఇద్దరు అధికార పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక్కో బ్లేడ్‌కు ఒక్కో రేటు

క్వారీల్లో తవ్విన గ్రానైట్‌ రాయిని ఫ్యాక్టరీలను తీసుకెళ్లి, అక్కడ పెద్దపాటి బ్లేడు ద్వారా కటింగ్‌ చేసి, వాటిని విక్రయిస్తుంటారు. కొన్ని ఫ్యాక్టరీల్లో సింగిల్‌ బ్లేడు ఉంటే, మరికొన్ని వాటిల్లో తొమ్మిది వరకు మల్టీబ్లేళ్లు ఉంటాయి. ప్రైవేటు కంపెనీకి ఇచ్చిన టెండరు గడువు ముగియడంతో రంగంలోకి దిగిన కూటమి ప్రభుత్వానికి చెందిన ప్రజా ప్రతినిధులు గ్రానైట్‌ ఫ్యాక్టరీ యజమానులతో భేటీ అయ్యారు. ఒక్కో బ్లేడుకు నెలకు రూ.35 వేల చొప్పున.. ఎన్ని బ్లేళ్లు ఉంటే అంత మొత్తం నెలవారీగా మామూళ్లు వసూళ్లుచేస్తున్నారు. జిల్లాలో దాదాపు 3 వేల గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఉంటే, 1500 ఫ్యాక్టరీల వరకు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఈ లెక్కన సగటున ఒక్కో ఫ్యాక్టరీలో రెండు బ్లేళ్లు ఉన్నాయకున్నా.. నెలకు రూ.70 వేల చొప్పున ఏకంగా రూ.10 కోట్ల మేర అక్రమంగా దిగమింగుతున్నారు. ఎవరైనా ఫ్యాక్టరీ నిర్వాహకులు ఈ మొత్తం ఎందుకు చెల్లించాలి..? అని ప్రశ్నిస్తే వెంటనే మైన్స్‌ అధికారులు, విజిలెన్స్‌ అధికారులు ఆ ఫ్యాక్టరీతో పాటు గ్రానైట్‌ వచ్చిన క్వారీపై దాడులకు దిగుతున్నారు. భారీ మొత్తంలో అపరాధ రుసుములు విధిస్తున్నారు. రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌గా చెప్పుకునే ఓ అధికారి జిల్లా మొత్తం చక్రం తిప్పుతూ ప్రభుత్వ ఆదాయానికి గండిగొడుతున్నాడనే ఆరోపణలున్నాయి.

గ్రా‘నైట్‌’..రైట్‌రైట్‌!1
1/1

గ్రా‘నైట్‌’..రైట్‌రైట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement