
దళితులకు అడుగడుగునా అవమానాలే!
వెదురుకుప్పం: కూటమి ప్రభుత్వంలో దళితులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో దళిత గ్రామాలకు వెళ్లి నేను పెద్ద మాదిగ అని చెప్పుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఠాపురం నియోజకవర్గంలో మాదిగపల్లె సామాజిక బహిష్కరణకు గురైతే ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. అలాగే నెల్లూరు జిల్లాలో దళితుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తే ఎలాంటి చర్యల్లేవన్నారు. దళిత సర్పంచ్ని సైతం అగౌరపరుస్తూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తే ఎందుకు మిన్నకుండిపోతున్నారని ప్రశ్నించారు. గురువారం వెదురుకుప్పంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత జాతి పట్ల ఘోర అవమానాలు జరుగుతున్నా హోం మంత్రి చర్యలు తీసుకోలేదన్నారు.