
గిట్టుబాటు కాని ధర
● కిలో రూ.8 కాదు..రూ.5కే కొనుగోలు చేస్తామంటున్న గుజ్జు పరిశ్రమలు ● అడిగిన ధరకు విక్రయించకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తామంటూ బెదిరింపులు ● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డెక్కిన మామిడి రైతులు ● నోరెత్తని రైతు సంఘాలు, కూటమి ఎమ్మెల్యేలు
మంత్రి ఆదేశాలు బేఖాతర్
ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చిత్తూరుకు చేరుకుని వ్యాపారులు, రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. కిలో మామిడి రూ.8 చొప్పున గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి మరో రూ.4 చొప్పున రైతులకు అదనంగా చెల్లిస్తామని పేర్కొన్నారు. గుడిపాలలోని ఓ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం రూ.6 చొప్పున కొనుగోలు చేస్తోంది. మిగిలిన పరిశ్రమల వారు కిలో రూ.5కే కొనుగోలు చేస్తున్నారు. పరిశ్రమల యజమానులంతా సిండికేట్గా మారడంతో జిల్లాలోని మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అల్లాడిపోతున్నారు. కూటమి నేతల మాటలకు, చేతలకు పొంతన లేకపోవడంతో రోడ్డెక్కుతున్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు గత సోమవారం బంగారుపాళెం, గంగాధరనెల్లూరు, చిత్తూరులో నడిరోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 80వేల హెక్టార్లకుపైగా మామిడి పంట సాగులో ఉంది. అందులో తోతాపురి సుమారు 50వేల హెక్టార్లలో సాగవుతోంది. దిగుబడి కూడా ఆశాజనకంగానే వచ్చింది. ఎండలు, ఈదురు గాలులను తట్టుకుని మామిడి పంట నిలబడింది. రైతులు కూడా సంబరపడిపోయారు. అధికారుల అంచనా ప్రకారం ఈ సీజన్లో తోతాపురి రకం 60వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మిగిలిన నీలం, అల్పోన్సో, బేనీషా, మల్లిక వంటి రకాలు మరో లక్ష మెట్రిక్ టన్నులకుపైగా దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మామిడి కోతలు పూర్తి చేసిన రైతులు పంట విక్రయించుకునేందుకు చిత్తూరు, పలమనేరు, దామలచెరువు, బంగారుపాళెం, తిరుపతి, పాకాల మార్కెట్లకు తరలివస్తున్నారు. అక్కడ ధరలు విని షాక్కు గురవుతున్నారు.
అందుకేనా ఈ బరితెగింపు!
తమిళనాడులో మామిడి దిగుబడిని చూసుకుని గుజ్జు పరిశ్రమల యజమానులు రెచ్చిపోతున్నారు. తాము సూచించిన ధరకే విక్రయించాలని బెదిరింపులకు దిగుతున్నారు. తమిళనాడులోని క్రిష్ణగిరి నుంచి తోతాపురి కాయలను దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడ కేజీ రూ.4 కొనుగోలు చేసి రూ.5కు ఫ్యాక్టరీకి అన్లోడింగ్ అయ్యేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.
ప్రభుత్వం వాటాను సైతం కొట్టేసే కుట్రలు
కిలో మామిడికి రూ.4 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రకటించిన నేపథ్యంలో గుజ్జు పరిశ్రమల వారు, టీడీపీ నేతలు ఆ సొమ్మును కొట్టేసేందుకు కుట్రకు తెరలేపారు. తమిళనాడులోని మామిడిని తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ఏపీకి తీసుకొచ్చి రైతుల ముసుగులో గుజ్జు పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. నిజమైన రైతులు మాత్రం మామిడి దిగుబడులతో రోడ్డుపై రోజుల తరబడి వేచి ఉంటే.. బినామీ రైతుల అవతారం ఎత్తిన వారు తమిళనాడు నుంచి కొనుగోలు చేసి వెంటనే పరిశ్రమల వారికి విక్రయించి అధికారులకు వివరాలు పంపుతున్నారు.
ఫ్యాక్టరీ ఎదుట నిరీక్షిస్తున్న రైతులు
‘‘అష్టకష్టాలు పడ్డాం. నీళ్లునిప్పులు లేని భూములు వేలకువేలు అప్పు చేసి చదును చేశాం. కొత్త రకాల మామిడి వంగడాలను తీసుకొచ్చి సాగుచేశాం. ఎండావానకు తట్టుకుని అనుకున్న విధంగానే దిగుబడి వచ్చింది. అప్పులు తీరుతాయని ఆశపడ్డాం. కానీ ఏం లాభం...? గిట్టుబాటు ధరలేక.. సకాలంలో విక్రయించుకోలేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. విధిలేని పరిస్థితుల్లో రోడ్డున పడేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గుజ్జు పరిశ్రమల వద్ద టోకెన్ల కోసం.. అన్లోడ్ కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇలాంటి దారుణ పరిస్థితి వస్తాదని కలలో కూడా ఊహించలేదు..’ అంటూ మామిడి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఫ్యాక్టరీల వద్ద నిరీక్షించలేక సహనం నశించి ఇంటి ముఖం పడుతున్నారు. చూపరులు వీరిని చూసి.. అయ్యో..దేవుడా! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
సిఫార్సులున్నవారికే టోకెన్లు
అధికారుల ఒత్తిడితో కొన్ని ఫ్యాక్టరీలు మామిడి కాయలలు కొనుగోలు కు టోకన్ల ప్రక్రియను తీసుకొచ్చాయి. ఫ్యాక్టరీలు జారీచేసే టోకన్ల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. అయితే ఫ్యాక్టరీలు మాత్రం అరకొర టోకెన్లు జారీచేసి చేతులు దులుపుకుంటున్నాయి. మిగిలినవి కూటమి పార్టీలు చెప్పిన వారికే టోకెన్లు ఇస్తూ రైతులను రోడ్డున పడేస్తున్నాయి. సిఫారస్సు తెచ్చుకుంటేనే టోకెన్లు అంటూ ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం. టోకెన్లు జారీ చేసే సమయానికి నీకా..నాకా అంటూ పోటీపడుతున్నారు. తోపులాటలు జరుగుతున్నాయి. గంగాధరనెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు, గుడిపాల, తవణంపల్లి, రేణిగుంట ప్రాంతాల్లో ఈ రకమైన సమస్యలు ప్రతి రోజూ ఎదురవుతున్నాయి. గత వారం రోజులుగా పరిశ్రమల వద్ద రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఇటు రైతులు, అటు వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించకపోవడంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యాపారుల సిండికేట్
ఉమ్మడి జిల్లాలోని ఫ్యాక్టరీ నిర్వాహకులు, వ్యాపారులు సిండికేట్ అయ్యారు. తోతాపురి అధిక దిగుబడిని సాకుగా చూపి ధరలను తగ్గించేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు పరిశ్రమల వద్ద అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఊదరగొట్టుకునే పనిలో పడ్డారు. ఫ్యాక్టరీలు రూ.8, ప్రభుత్వ ప్రోత్సాహ నిధి కింద కిలోకు మరో రూ.4, వెరసి మొత్తం కిలోకు రూ.12 వస్తుంది అని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం వ్యాపారులు ఫ్యాక్టరీలతో కుమ్మకై ర్యాంపులు ఏర్పాటు చేసుకుని కేజీ రూ.4కే కొనుగోలు చేస్తున్నారు. దీనిపై వరుసగా ఫిర్యాదులు చేయడంతో అధికారులు గుజ్జు పరిశ్రమల వారితో సమావేశమయ్యారు. రెండు వారాల క్రితం చిత్తూరు జిల్లా కలెక్టర్ కిలో రూ.8కు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అ తర్వాత తిరుపతి జిల్లా కలెక్టర్ కూడా వ్యాపారులతో సమావేశమై ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మామిడిని కొనుగోలు చేయాలని ఆదేశించారు. అయితే గుజ్జు పరిశ్రమల యాజమన్యాం పట్టించుకోలేదు.

గిట్టుబాటు కాని ధర

గిట్టుబాటు కాని ధర

గిట్టుబాటు కాని ధర