
తోతాపురి కిలో రూ.6
చిత్తూరు రూరల్ (కాణిపాకం): తోతాపురి కిలో రూ.6కు తగ్గకుండా చూస్తామని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ జి.విద్యాధరి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఆమె తోతాపురి మామిడి కాయల కొనుగోలు ప్రక్రియపై మీడియాతో మాట్లాడారు. జిల్లాలో సుమారు 98 వేల ఎకరాలలో దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి పండిస్తున్నారని చెప్పారు. జిల్లాలో 35 ప్రొసెసింగ్ యూనిట్లు ఉండగా అందులో 27 పరిశ్రమలు మాత్రమే మామిడి పండ్ల ప్రొసెసింగ్ చేస్తున్నాయన్నారు. గుజ్జు పరిశ్రమల ద్వారా రోజూ దాదాపు 7 వేల మెట్రిక్ టన్నుల మామిడి ప్రొసెసింగ్ జరుగుతోందన్నారు.
మామిడి రైతులు నష్టపోకూడనే ఉద్దేశంతో తోతాపురి మామిడి కిలో రూ.12గా మద్దతు ధర నిర్ణయిస్తూ జూన్ 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు. ఇందులో గుజ్జు పరిశ్రమలు రూ.8 చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం అధనంగా రూ.4 మద్దతు ధరను రైతుల ఖాతాలకు నేరుగా జమచేస్తుందన్నారు. 38 ర్యాంపులు, 2 మండీల వద్ద అమ్ముకునే రైతులకు కూడా ప్రభుత్వం రూ.4 మద్దతు ధరను అందిస్తుందన్నారు.
మామిడి కాయల కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రతి ప్రొసెసింగ్ యూనిట్, మండీలు, ర్యాంప్ వద్ద హార్టికల్చర్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఒక వీఆర్వోతో కూడిన టాస్క్ఫోర్స్ టీంను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని మామిడి రైతులకు సమస్యలుంటే 08572–242777, 9491077325 హెల్ప్లైన్లోకు సంప్రదించాలని కోరారు. గత ఎనిమిది రోజుల నుంచి తోతాపూరి మామిడికాయలు 38 వేల టన్నులు ఫ్యాక్టరీలకు సరఫరా చేసినట్లు ఆమె వివరించారు.