
9న ఆశావర్కర్ల సమ్మె
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన సమ్మెకు దిగుతున్నట్లు ఆశ వర్కర్ల యూనియన్ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణిని కలిసి సమ్మె నోటీసును అందజేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. ఆశవర్కర్లకు కనీస వేతనం అమలు చేయాని, సమస్యలపై స్పందించి పరిష్కరించేలా చూడాలన్నారు. ఆశా వర్కర్లకు అదనపు పనులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
నిరసనలకు అనుమతి తప్పనిసరి
చిత్తూరు అర్బన్: బహిరంగ ప్రదేశాల్లో నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టాలంటే తప్పనిసరిగా డీఎస్పీ స్థాయి అధికారి నుంచి అను మతి తీసుకోవాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ ఓ ప్రకటనలో తెలిపారు. శాంతియుత ర్యాలీ లు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించేప్పుడు ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు సంబంధిత వ్యక్తులు పోలీసుల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. డీఎస్పీకి రాత పూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే, ఆయన పరిస్థితిని సమీక్షించి అనుమతలిస్తేనే కార్యక్రమాలు జరుపుకోవాలన్నారు.
స్మార్ట్ మీటర్లు వద్దు బాబోయ్!
చిత్తూరు కార్పొరేషన్: నివాసాలకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దని విద్యుత్ వినియోగదారుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి స్థానిక గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రధాన కార్యదర్శి చైతన్య మాట్లాడారు. ఇళ్లకు అదానీ స్మార్ట్ మీటర్ల బిగింపును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఈ విధానంతో భవిష్యత్లో పలు ఇబ్బందులు రావడం ఖాయమన్నారు. ఇందులో బిల్లులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. జవాబుదారీ తనం కూడా ఉండదన్నారు. వీటిని దశలవారీగా ప్రీపెయిడ్ మీటర్లకు మారుస్తారన్నారు. అప్పుడు ముందుగానే వాటికి రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రాత్రుల్లో కరెంటు పోతే రీచార్జ్ చేస్తే గానీ విద్యుత్ సరఫరా కాదన్నారు. నాయ కులు సురేంద్రనాథ్, శ్రీనివాసమూర్తి, సౌక త్, మునస్వామి, రషీద్, సురేంద్రనాథ్, రో జా, కోమల, విజయగౌరి, రవి, విజయభాస్కర్ పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీలో నియామకాలు
చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీలో చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన పలువురికి రాష్ట్ర అనుబంధ విభాగాల్లో చోటు కల్పిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలు వెల్లడించింది. నగరి నియోజకవర్గానికి చెందిన చిరంజీవిని రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శిగా, పలమనేరు నియోజకవర్గానికి చెందిన నాగరాజును రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా, కుప్పం, శ్రీకాళహస్తి, సూళ్లూ రుపేట నియోజకవర్గాలకు చెందిన రాజచంద్రశేఖర్గౌండర్, వెంకటరమణయ్య, జయరామయ్యను రాష్ట్ర కల్చరల్ వింగ్ కార్యదర్శులుగా నియమించినట్టు పేర్కొంది.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 84,681 మంది స్వామి వారిని దర్శించుకోగా 35,261 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.43 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

9న ఆశావర్కర్ల సమ్మె