
పీఎం శ్రీకి షాక్
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలను విస్మరిస్తున్న టీడీపీ
తల్లికి వందనం ఇవ్వకుండా ఎగనామం
రగిలిపోతున్న బీజేపీ నేతలు
కేవీఎస్ విద్యార్థులు
చిత్తూరు కలెక్టరేట్/ తిరుపతి ఎడ్యుకేషన్ : కూటమి ప్రభుత్వం బీజేపీకి షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వర్తింపజేయకుండా నాన్చుతోంది. ఎన్నికల ముందు మేనిఫెస్టో ప్రకటించే సమయంలో బీజేపీ మేనిఫెస్టోకు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలకు పథకాలు ఇవ్వకుండా మినహాయించింది. ఫలితంగా వేలాది మంది పేద విద్యార్థులు అర్హత ఉన్నప్పటికీ తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందలేకపోయారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకత్వం ఈ నెల 21న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలోనే పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు పీఎంకు ఈ మెయిల్స్ పంపిస్తున్నా రు. అయితే పీఎం కార్యాలయం నుంచి విద్యార్థులకు, ఆ పాఠశాలలకు ఇంకా ఎలాంటి సమా ధానం రాలేదు. ఈ సమాచారం అందుకున్న కూటమి ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయ విద్యార్థులను, తల్లిదండ్రులను సచివాలయాల్లో ఫిర్యా దు చేసుకోవాలని సూచించింది. అయితే సచివాలయ సిబ్బంది మాత్రం తల్లికి వందనం దరఖాస్తులను ఆయా బడుల్లోనే చేసుకోవాలని వెనక్కి పంపించేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాలలకు సమాచారం చేరవేశారు. ఈ సమయంలో ఈ పథకం వర్తింపుపై బీజేపీ శ్రేణులే చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
వేల మందికి నష్టం
తిరుపతి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో పీఎం శ్రీ పాఠశాలలు 2, రేణిగుంటలో 1, ఏర్పేడు ఐఐటీలో 1, వెంకటగిరిలో 1 మొత్తం 5 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 30 వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న ఒక్క విద్యార్థికి సైతం తల్లికి వందనం నగదు ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది.
లోలోపలే కక్ష సాధింపులు
పైకేమో కూటమి సర్కారు అంటూ ఆర్భాటాలు...లోపలేమో కక్ష సాధింపులు. తాజాగా విడుదలైన తల్లికి వందనం పథకంలో సెంట్రల్ పరిధిలో నిర్వహిస్తున్న పాఠశాలల విద్యార్థులకు తల్లికి వందనం పథకం మంజూరు చేయని దుస్థితి. గత వైఎస్సార్సీపీ సర్కారులో ఎలాంటి తారతమ్యం లేకుండా అన్ని యాజమాన్యాల పిల్లలకు అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు తమతో పాటే ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్ల టీడీపీ కక్ష సాధింపు ధోరణి చేస్తోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్స్ లో వేలాది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలల్లో ఒక్క విద్యార్థికి కూడా తల్లికి వందనం మంజూరు కాకపోవడం చర్చనీయంశంగా మారింది. ఎన్నికల సందర్భంగా టీడీపీ రూపొందించిన మేనిఫెస్టోను బీజేపీ విస్మరించడంతోనే ఇలా కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.