
ఆందోళనలో తల్లిదండ్రులు
నష్టపోతున్న పేద పిల్లలు
సుదూర ప్రాంతాలకు పంపించలేక ఆపసోపాలు
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
చోద్యం చూస్తున్న కూటమి నేతలు
‘ఈ ప్రభుత్వం(గత వైఎస్సార్సీపీ) బడులను కూడా వదల్లేదు. ఊర్లోనే చిన్న పిల్లలు చదువుకోవడం ఇష్టం లేదు. అందుకే కిలోమీటర్ల దూరంలోని పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. అంతదూరం పిల్లలు ఎలావెళ్తారో కూడా ఆలోచించడం లేదు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విలీన ప్రక్రియకు ఫుల్స్టాప్ పెడుతుంది. ఎక్కడ బడి ఉంటే అక్కడే పిల్లలు చదువుకునేలా అవకాశం కల్పిస్తుంది’ అంటూ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ఊదరగొట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రభుత్వ బడులకు ఉరివేశారు. తమ సొంత గ్రామాల్లోనే పేద పిల్లలు చదువుకుంటున్న బడులను సుదూర ప్రాంతాల్లోకి విలీనం చేస్తున్నారు. కిలోమీటర్ల మేర పిల్లలు నడిచి వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. తమ పిల్లల బాధలు తీర్చాలంటూ తల్లిదండ్రులు ఆందోళన బాట పడుతున్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వ నిర్ణయాలు పేద విద్యార్థులకు గుదిబండగా మారుతున్నాయి. గ్రామంలోనే చదువుకోవచ్చన్న వారి ఆశలు అడియాశలవుతున్నాయి. విలీనం పేరుతో వేధింపులకు దిగడం.. సుదూర ప్రాంతాలకు తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మోడల్ ప్రైమరీ పాఠశాలలు, ఫౌండేషన్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వ బడులను విలీనం చేయడం విడ్డూరంగా ఉందని పలువురు మండిపడుతున్నారు. పాఠశాలలు యథావిధిగా తమ గ్రామాల్లోనే కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టరేట్కు క్యూ కడుతున్నారు. వినతిపత్రాలు అందించి తమ పిల్లల కష్టాలు చెప్పుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.
ప్రభుత్వ బడులపై కూటమి కక్ష
కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జిల్లాలోని సర్కారు బడులపై కక్షగట్టింది. ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయాల్సింది పోయి విలీనం పేరుతో కత్తి దూసింది. అసంబద్ధత నిర్ణయాలు తీసుకుని పేద విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోంది. జిల్లాలోని ప్రతి మండలంలో మోడల్ ప్రైమరీ పాఠశాలలను నెలకొల్పడంతో చాలా గ్రామాల్లో ప్రభుత్వ బడులు విలీనం అయ్యాయి. పాఠశాలలు పున:ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను దూరాభారం పంపించలేక అష్టకష్టాలు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు పిల్లలను బడికి పంపడం మాన్పిస్తున్నారు. మరికొందరు ప్రయివేటు పాఠశాలలకు పంపుతున్నారు.
బడికి దూరం
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన విలీన ప్రక్రియ వల్ల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేల మంది విద్యార్థులు బడికి దూరం కావాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,436 పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి 64,519, 1 నుంచి 8వ తరగతి 45,800, 6 నుంచి 10వ తరగతి వరకు 30,898 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 60 మంది విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలలు) పేరుతో మార్పు చేశారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నుంచి ఆఘమేఘాల మీద దొంగ సంతకాలు చేయించుకుని బడులను విలీనం చేశారు. తల్లిదండ్రుల సమ్మతి లేకుండానే తామనుకున్నది నెరవేర్చారు. ప్రస్తుతం బడులు పున:ప్రారంభమయ్యాక తల్లిదండ్రులకు కూటమి చేసిన అసలు విషయం బయటపడింది. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో విలీన ప్రక్రియ చేపట్టి 498 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ను ఏర్పాటు చేశారు. దీంతో వేల మంది విద్యార్థులు బడికి దూరమయ్యారు.
జిల్లాలో 545 ప్రభుత్వ బడులు విలీనం
కూటమి ప్రభుత్వం మోడల్ ప్రైమరీ స్కూళ్ల పేరుతో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 545 ప్రభుత్వ బడులను విలీనం చేసింది. ఆ బడులను దూర ప్రాంతాల్లో విలీనం చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేపడుతున్నారు. విలీనం చేసిన బడులను తిరిగి యథాతధంగా కొనసాగించాలని ధర్నాలకు దిగుతున్నారు. ప్రస్తుతం విలీనం చేసిన 545 బడులను మోడల్ ప్రైమరీ స్కూళ్ల పేరుతో 498 పాఠశాలల్లోకి 3,4,5 తరగతులను విలీనం చేశారు.