అక్రమ రిజిస్ట్రేషన్‌పై కొరడా | - | Sakshi
Sakshi News home page

అక్రమ రిజిస్ట్రేషన్‌పై కొరడా

Jun 19 2025 4:14 AM | Updated on Jun 19 2025 4:14 AM

అక్రమ రిజిస్ట్రేషన్‌పై కొరడా

అక్రమ రిజిస్ట్రేషన్‌పై కొరడా

● ఆర్కే గార్డెన్స్‌కు జరిమానా విధింపు ● జిల్లా రిజిస్ట్రార్‌ విచారణలో అక్రమాలు బహిర్గతం ● రూ.10.80 లక్షల స్టాంపు డ్యూటీ చెల్లించాలంటూ ఆదేశం ● ఫలించిన సమాచార హక్కుల వేదిక పోరాటం

పుత్తూరు : మండల పరిధిలోని ఆర్కే గార్డెన్స్‌ ఫంక్షన్‌ హాల్‌ యజమాని రవీంద్రన్‌కు రూ.10.80 లక్షల స్టాంప్‌ డ్యూటీతో పాటు అపరాధ రుసుం చెల్లించాలంటూ తిరుపతి జిల్లా రిజిస్ట్రార్‌ జి.శ్రీరామ్‌కుమార్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆర్డర్‌ కాఫీని గత మే నెల 29వ తేదీన జారీ చేశారు. ఆర్డర్‌ కాఫీ అందుకున్న 15 రోజుల్లోపు స్టాంప్‌ డ్యూటీ మొత్తాన్ని చెల్లించాలని లేని పక్షంలో ఇండియన్‌ స్టాంప్స్‌ సెక్షన్‌ 1899 చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

నివాస ఖాళీ స్థలంగా చూపడంతో..

స్థానిక ఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్న ఎం.రవీంద్రన్‌ పుత్తూరు మండల పరిధిలోని ఉత్తరపుకండ్రిగ పంచాయతీ చిన్నబ్బనాయుడు కండ్రిగ వద్ద ఆర్‌కే గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌ నిర్మించారు. ఆయన 2023 డిసెంబర్‌ 13, 14 తేదీలలో పుత్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తన కుమార్తె ప్రత్యూష పేరిట సదరు ఆస్తిని రిజిస్ట్రర్‌ చేయించారు. ఈ సందర్భంగా సదరు ఆస్తిని నివాస ఖాళీ స్థలంగా చూపుతూ డిక్లరేషన్‌ ఇచ్చారు. ఆస్తి మొత్తం విలువ రూ.1,08,96,604గా పేర్కొన్నారు.

సమాచార హక్కుల వేదిక ఫిర్యాదు

పుత్తూరు మండలంలోని ఆర్కే గార్డెన్స్‌ నిర్మాణానికి పంచాయతీ నుంచి, తుడా కార్యాలయం నుంచి పొందిన అనుమతులను కోరుతూ స్థానిక సమాచార హక్కుల వేదిక కార్యదర్శి కె.మురగారెడ్డి ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని కోరడంతో అసలు విషయం బయట పడింది.

కేవలం రూ.2.18 లక్షలు చెల్లించి..

స్టాంప్‌ డ్యూటీ రూ.12.94 లక్షలు కాగా, రవీంద్రన్‌ ఇచ్చిన తప్పుడు డిక్లరేషన్‌ ద్వారా కేవలం రూ.2.18 లక్షలు మాత్రం చెల్లించినట్లు విచారణలో తేటతెల్లం అయింది. దీంతో డెఫిసిట్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.4,720తో కలిపి మొత్తం రూ.10,80,520 చెల్లించాలంటూ రవీంద్రన్‌ను ఆదేశించారు.

ఫిర్యాదు మేరకే విచారణ చేపట్టాం

ఆర్కే గార్డెన్స్‌ క్రయ విక్రయాలపై వచ్చిన ఫిర్యాదు మేరకే విచారణ చేపట్టాం. విచారణలో పుత్తూరు ఎంపీడీఓ 2023 డిసెంబర్‌కు ముందే ఆ నిర్మాణాలపై నోటీసులు ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. 2023 డిసెంబర్‌లో జరిగిన ఈ రిజిస్ట్రేషన్‌ స్టాంప్స్‌ చట్టం సెక్షన్‌ 27కి వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది. దీంతో పూర్తి స్థాయి స్టాంప్‌ డ్యూటీ చెల్లించాలని ఆదేశించాం.

– జి.శ్రీరామ్‌కుమార్‌, జిల్లా రిజిస్ట్రార్‌, తిరుపతి

జిల్లా రిజిస్ట్రార్‌ విచారణ ఇలా..

● సమాచార హక్కుల వేదిక వారు ఆర్టీఐ ద్వారా అడిగిన వివరాల మేరకు తిరుపతి జిల్లా రిజిస్ట్రార్‌ చేపట్టిన విచారణలో వాస్తవాలు వెలుగు చూశాయి.

● జిల్లా రిజిస్ట్రార్‌ ఆదేశాల మేరకు పుత్తూరు ఎంపీడీఓ స్థల పరిశీలన చేసి ఇచ్చిన నివేదికలో సర్వే నంబర్‌ 145–1ఏ2, 145–2సి2లో 2023 డిసెంబర్‌ నాటికే ఆర్కే గార్డెన్‌ ఫంక్షన్‌ హాలు నిర్మాణం పూర్తయిందని తెలిపారు.

● పుత్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ సైతం స్థల పరిశీలన చేసి శాశ్వత భవనాలు ఉన్నట్లు గుర్తించి, మార్కెట్‌ విలువను దాచిపెట్టి రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు నివేదిక ఇచ్చారు.

● ఆర్‌సీసీ నిర్మాణం 2,591 చదరపు అడుగుల్లో జరిగిందని, ఏసీసీ నిర్మాణం 17,361 చదరపు అడుగులుగా నివేదికలో పొందుపరిచారు.

● రవీంద్రన్‌ తెలిపిన ఆస్తి విలువ రూ.1.8 కోట్లు కాగా విచారణలో మొత్తం ఆస్తి విలువ రూ.6.47 కోట్లుగా లెక్కగట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement