వైఎస్సార్‌సీపీ కీలక నేతలను వేధిస్తున్న ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కీలక నేతలను వేధిస్తున్న ప్రభుత్వం

Jun 19 2025 4:14 AM | Updated on Jun 19 2025 9:36 AM

-

లిక్కర్‌ స్కామ్‌ అంటూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్టు 

 అపనిందలతో అప్రతిష్టపాలు చేసేందుకు యత్నం 

 గతంలో ఆయన వద్ద పనిచేసిన వారికీ తప్పని వేధింపులు 

 ఎట్టకేలకు అరెస్ట్‌ చేయించి కూటమి నేతల పైశాచిక ఆనందం 

 సాయం చేయడానికి వెళ్లినా.. కార్యకర్తల పరామర్శకు వెళ్లినా కేసులే..!

వైఎస్సార్‌సీపీలో క్రి యాశీలకంగా వ్యవహరించే నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్‌ చేసింది. ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో కుట్రలకు తెరతీసింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కీలక నాయకులపై కక్షగట్టింది. వైఎస్‌ జగన్‌ వెంట నడిచేవారిని వేధించేందుకు పన్నాగాలు పన్నుతోంది. వెంటాడి మరీ అరెస్ట్‌లు చేయించి పైశాచికానందం పొందుతోంది. అందులో భాగంగానే లిక్కర్‌ స్కామ్‌ అంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సర్కారు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేయించింది. అన్యాయంగా అపనిందలు మోపి అప్రతిష్టపాలు చేసేందుకు.. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాదరణను అణచి వేసేందుకు యత్నిస్తోంది.

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : జిల్లాలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం కుట్రలు పరాకాష్టకు చేరాయి. మాజీ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దల డైరెక్షన్‌లో అధికారులు పని చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఇప్పుడు తప్పులు కేసులు పెడుతున్న అధికారులు.. రేపనేది ఒకటి ఉంటుందని.. ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటనేది ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా జిల్లాలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చెవిరెడ్డి కుటుంబంపై కక్ష సాధించేందుకు కూటమి ప్రభుత్వంలోని కొందరు కుట్రలు పన్నుతూ వచ్చారు. అయితే నిత్యం ప్రజల మధ్య ఉండే చెవిరెడ్డి ఎటువంటి తప్పులు చేయరని అందరికీ తెలుసు. అయితే ఇటీవల ఎర్రావారిపాళెం మండలంలో ఓ బాలికపై అఘాయిత్యం జరిగిందని ఆమె తండ్రి చెవిరెడ్డికి ఫోన్‌ చేసి సాయం చేయమని అడిగితే.. ఆయన అక్కడకు వెళ్లి ఆడబిడ్డకు సాయం చేసినందుకు పోక్సో కేసు పెట్టారు.. ఆ కేసులో అరెస్టు చేయాలని చూసినా ఆ బిడ్డ తల్లిదండ్రులే మీడియా ముందుకు వచ్చి చెవిరెడ్డిపై తాము ఫిర్యాదు చేయలేదని చెప్పడంతో పోలీసులు వెనకడుగు వేశారు.

లిక్కర్‌ కేసులో ఎలా ఇరికించారంటే..!
ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో రూ.8 కోట్లు పోలీసులకు పట్టుబడితే దానిని ఎన్నికల అధికారులు సీజ్‌ చేశారు. ఆ నగదుకు సంబంధించిన వారు వ్యాపార నిమిత్తం తరలిస్తుండగా పట్టుబడినట్టు చెబుతూ అందుకు తగిన ఆధారాలను కోర్టుకు, విజయవాడ పోలీసు కమిషనర్‌కు, ఎన్నికల అధికారులకు కూడా అందించారు. దానిపై కోర్టులో కేసు నడుస్తుండగానే చెవిరెడ్డి దగ్గర గతంలో పనిచేసిన గన్‌మెన్‌ గిరిని సిట్‌ అధికారులు తీసుకువెళ్లి బెదిరించి ఎన్నికల్లో పట్టుబడిన డబ్బుతో పాటు రూ.200 నుంచి రూ.250కోట్లు చెవిరెడ్డి తరలించినట్టుగా తప్పుడు స్టేట్‌మెంట్‌ తీసుకున్నారని అరెస్టుకు ముందు చెవిరెడ్డి మీడియాకు వివరించారు. గన్‌మెన్‌ గిరి ఇచ్చిన వివరాల మేరకు మరో గన్‌మెన్‌ మదన్‌రెడ్డి, గతంలో చెవిరెడ్డి దగ్గర వ్యక్తిగత సహాయకులుగా పనిచేసిన బాలాజీ, నవీన్‌ పేర్లను కూడా ఆ కేసులో ఇరికించారని, వారందరినీ భయపెట్టి చెవిరెడ్డి తీసుకురమ్మంటేనే ఆ డబ్బులు తరలించినట్టుగా స్టేట్‌మెంట్లు రికార్డు చేశారని మీడియా ముందు చెవిరెడ్డి స్వయంగా వెల్లడించారు.

ఇంతమందిని వేధించి, నరకం చూపించడం కన్నా తనను నేరుగా అరెస్టు చేసుకోవచ్చని కూడా చెప్పారు. అయితే సిట్‌ అధికారులు మాత్రం చెవిరెడ్డికి బెయిల్‌ లభించకుండా చేయడానికి అన్ని విధాలుగా స్టేట్‌మెంట్లు తయారు చేసుకున్న తరువాతే ఆ పనిచేశారు. మదన్‌రెడ్డి డీజీపీకి రాసిన లేఖతో ఖంగుతిన్న సిట్‌ అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెవిరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఆ సమయంలో ఆయన విజయవాడలోనే ఉన్నట్టు తెలిసినా సిట్‌ అధికారులు ఎందుకు అరెస్టు చేయలేదనేది ప్రశ్నార్థకం.

ఎల్లో నేతల పైసాచిక ఆనందం
ఏపీ లిక్కర్‌ స్కాం కింద సిట్‌ అధికారులు చెవిరెడ్డిని అరెస్టు చేయడంతో కూటమి ప్రభుత్వంలోని పెద్దలు పైసాచిక ఆనందం పొందుతున్నారని చెవిరెడ్డి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా సాయం చేయడంతో పాటు ఎవరినీ ఇబ్బంది పెట్టని చెవిరెడ్డికి ఇన్ని కష్టాలు రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెవిరెడ్డికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని, ఆ కుటుంబానికి అండగా నిలబడతామని గ్రామస్తులు, బంధువులు స్పష్టం చేస్తున్నారు. చెవిరెడ్డి అరెస్టుపై కూటమి ప్రభుత్వం కక్షకట్టిందని ఈ రాష్ట్ర ప్రజలకు సుస్పష్టమైంది.

నేరుగా అరెస్టు చేసుకోండని సవాల్‌ చేసినా..
ఏ తప్పు జరగని లిక్కర్‌ స్కాం కేసులో చెవిరెడ్డిని అక్రమంగా ఇరికించారు. అంతేకాదు.. అరెస్టు చేసిన తరువాత బెయిల్‌ రాకుండా చేయడానికి ఆయన దగ్గర గతంలో పనిచేసిన వారందరినీ వేధించి మరీ స్టేట్‌మెంట్లు తీసుకున్నట్టు స్వయంగా చెవిరెడ్డి మీడియాకు తెలిపారు. చెవిరెడ్డి దగ్గర పనిచేసిన వారందరికీ సిట్‌ అధికారుల వేధింపులు మాత్రం తప్పలేదు. ఇంతమందిని వేధించడం వెనుక తప్పుడు కేసుల్లో చెవిరెడ్డిని ఇరికించడానికి చేసిన ప్రయత్నమే అనేది ఆయన దగ్గర గన్‌మెన్‌గా పని చేసిన మదన్‌రెడ్డి ఇటీవల డీజీపీకి రాసిన లేఖతో తేటతెల్లమైంది. 

ఆ లేఖతో అప్పటి వరకు సిట్‌ అధికారులు చేసిన టార్చర్‌ను సోషల్‌ మీడియా వేదికగా చెవిరెడ్డి స్వయంగా బయటకు తేవడంతో మీడియాలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. సిట్‌ అధికారులు తప్పుడు సాక్ష్యాలు సృష్టించడానికి సామాన్యులను నరకం చూపుతున్నారనే విషయం బహిర్గతం కావడంతో చేసిన తప్పు కప్పి పుచ్చుకునేందుకు, ఆ విషయాన్ని దారి మళ్లించేందుకు చెవిరెడ్డిని అరెస్టు చేయడం ఒక్కటే మార్గమని సిట్‌ అధికారులు భావించారు. అందుకే ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ కాపీని చెవిరెడ్డికి ఇవ్వకుండా, కేసు పెట్టినట్టు చెప్పకుండా విజయవాడలోనే తిరుగుతున్న చెవిరెడ్డిని పట్టుకోకుండా.. లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసి విదేశాలకు వెళ్తుంటే బెంగళూరు విమానాశ్రయంలో పట్టుకున్నట్టు సిట్‌ అధికారులు కలరింగ్‌ ఇచ్చారనే విమర్శలు వైఎస్సార్‌సీపీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి.

ఏడాదిగా ఏపీలో అరాచక పాలన
జరగని స్కాంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు చేర్చి అక్రమంగా అరెస్ట్‌ చేయడం దారుణం. ఏడాది నుంచి రాష్ట్రంలో కూటమి అరాచక పాలనకు అంతులేకుండాపోతోంది. ప్రజాప్రతినిధుల వద్ద గన్‌మెన్‌లుగా పనిచేసిన పోలీసులను సైతం లాక్కెళ్లి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వమని చిత్రహింసలకు గురిచేయడం ఏపీలోని కూటమి పాలనకే చెల్లింది. మా నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు పర్యటన కార్యక్రమం నుంచి జనం దృష్టి మరల్చడానికే చెవిరెడ్డిని రాత్రికి రాత్రే అరెస్టు చేశారు. అక్రమ కేసులు, అరెస్ట్‌లతో భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం వారి అవివేకానికి నిదర్శనం. ప్రజల నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి భయపడి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు.
– భూమన కరుణాకర రెడ్డి, వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement