
వేరుశనగపై వెనుకడుగు
పలమనేరు : ఖరీఫ్ సీజన్లో వర్షాధారంగా జిల్లాలో వేరుశనగ ఎక్కువ మంది సాగు చేస్తారు. కానీ ఏటా వేరుశనగ సాగుపై జిల్లాలోని రైతులు ఆసక్తి చూపడంలేదు. ఇందుకు ప్రధాన కారణం పంటకు పెట్టిన పెట్టుబడులు దక్కడం లేదు. అతివృష్టి, అనావృష్టితో పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పంట దిగుబడులు ఎకరానికి నాలుగైదు బస్తాలు కావడం లేదు.
ఎకరా పొలంలో పంట సాగుకు రూ.15 వేల దాకా పెట్టుబడి అయితే దిగుబడి రూ.5 వేలు కూడా దక్కడం లేదు. దీంతో రైతులు వేరుశనగ పంటపై ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది.
● అధికారులేమో విత్తనాలిచ్చేటప్పుడు తప్పకుండా సాగుచేస్తామని ధ్రువీకరణ తీసుకొని రైతులకు పంపిణీ చేస్తున్నారు. కానీ సగం మంది రైతులు విత్తనాలను సాగు చేయకుండా ఇంటి అవసరాలకు వాడుకోవడం జరుగుతోంది. దీంతో జిల్లాలో ఏటా వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గుముఖం పడుతోంది.
తగ్గుముఖం పట్టిన సాగు
పదేళ్ల కిందట ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1.20 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాధారణ సాగుగా ఉండేది. ఏటా పంటల సాగు తగ్గుతూ వస్తోంది. జిల్లా విభజన జరిగాక పంట సాధారణ సాగు 55 వేల హెక్టార్లకుగా ఉండేది. ప్రస్తుతం సాధారణ సాగు 35 వేల హెక్టార్లకు పడిపోయింది. దీంతో ఈ విడత పంటల సాగు 20 వేల హెక్టార్లు కూడా అనుమానంగానే మారింది.
విత్తనకాయలు తీసుకుంటున్నారు..
బహిరంగ మార్కెట్లో వేరుశనగ కిలో ధర రూ.93 దాకా ఉంది. ప్రభుత్వం 40శాతం సబ్సిడీతో ( రాయితీ రూ.37.20 పైసలు)పోనూ రైతు వాటాగా రూ. 55.80 చెల్లించాలి. దీంతో కేజీకి రైతుకు రూ.37 మిగులుతుంది. బస్తా(30 కేజీలకు) రూ. 1116 దక్కినట్టే. ఇలా వచ్చే డబ్బును ఎందుకు వదులుకోవాలని రైతులు ఎగబడి విత్తనాలను కొంటున్నారు.
సాగుపై అన్నదాతల సంకటం
తగ్గనున్న వేరుశనగ సాగు విస్తీర్ణం
విత్తనాలు తీసుకున్నా సాగుకు కదలని రైతన్న
కచ్చితంగా సాగు చేయాలని చెబుతున్న అధికారులు
వేరుశనగ విత్తనకాయలకు సంబంధించిన వివరాలు
జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం : 35,228 హెక్టార్లు
ఖరీఫ్లో పంటను సాగు చేసే రైతులు : 90 వేల మంది
అవసరమైన విత్తనకాయలు : 40 వేల క్వింటాళ్లు
కూటమి ప్రభుత్వంలో అందినవి : 26,349 క్వింటాళ్లు
త్వరలో జిల్లాకు రానున్న విత్తనాలు : 13 వేల క్వింటాళ్లు
విత్తనాలు తీసుకున్న వారు సాగు చేయాలి
పట్టాపాసు పుస్తకం ఉండి ఆధార్ లింకై న రైతులు మొబైల్ నంబరు ఓటీపీ ఆధారంగా విత్తన కాయలను పంపిణీ చేశాం. పొందిన విత్తనాలకు తప్పకుండా సాగు చేయాలని రైతుల నుంచి ధ్రువీకరణ పత్రాలను తీసుకున్నాం. ఇప్పటి దాకా పంపిణీ చేసిన విత్తనాల మేరకు ఎంత మేర పంట సాగు కావాలో లెక్కలు కట్టి క్షేత్ర స్థాయిలో రైతులు పంటను సాగు చేసేలా చర్యలు తీసుకుంటాం. – మురళీ కృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి
పంట పెట్టుబడి దక్కితే కదా..
ఇంతకు ముందు వేరుశనగ సాగు చేసినోళ్లమే. రాను రాను పంటకు పెట్టిన పెట్టుబడి కూడా దక్కక నష్టాలు చవిచూశాం. అందుకే వేరుశనగకు బదులు చిరు ధాన్యా లు, అక్టోబరులో ఉలవ సాగు చేస్తున్నాం. ప్రభుత్వం వేరుశనగకు కనీస మద్దతు ధర పెట్టి రైతులకు నష్టం రాకుండే చూస్తే సాగు పెరుగుతుంది. నష్టాలు ఎందుకని రైతులు విత్తనాలు తీసుకొని ఇంట్లో అవసరాలకు వాడుకోవాల్సి వస్తోంది. – సుబ్బన్న, రైతు, కల్లాడు

వేరుశనగపై వెనుకడుగు

వేరుశనగపై వెనుకడుగు

వేరుశనగపై వెనుకడుగు