
ఇంకెన్ని సార్లు తిరగాలో..?
● వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు విచ్చేసిన ప్రజలు ● వినతులు స్వీకరించిన ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి ● పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీలు 254
చిత్తూరు కలెక్టరేట్ : ‘‘మా సమస్యలు ఇంకెన్ని సార్లు విన్నవించుకోవాలి, ఇంకెన్ని సార్లు తిరగాలో ఏమో..’’ అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు మార్లు అర్జీలిస్తున్నప్పటికీ తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని బాధితులు దిగులు చెందుతున్నారు. కలెక్టరేట్లో సోమ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి అర్జీలను ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి స్వీకరించారు. పలు సమస్యలపై 254 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో మోహన్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ అనుపమ, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
దివ్యాంగ పింఛన్ మంజూరు చేయండి
అన్ని అర్హతలున్నప్పటికీ తనకు దివ్యాంగ పింఛన్ ఇవ్వడం లేదని పలమనేరుకు చెందిన దివ్యాంగుడు నాగం ఆవేదన వ్య క్తం చేశారు. తనకు 100 శాతం వైకల్యం ఉన్నట్లు తెలిపారు. దివ్యాంగ పింఛన్ కోసం పలు మార్లు అధికారులకు అర్జీ ఇచ్చినప్పటికీ ఎవరూ న్యాయం చేయడం లేదని కన్నీరు మున్నీరయ్యారు. దివ్యాంగులపై కనికరం చూపాలని ఆవేదన వ్యక్తం చేశారు.
వేతనమైనా ఇవ్వండి... పథకాలైనా వర్తింపచేయండి
అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వ వేతనమైనా ఇవ్వాలి లేదా సంక్షేమ పథకాలైనా వర్తింప చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘాల నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ మేరకు అంగన్వాడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు లలిత, షకీల మాట్లాడుతూ సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను నమోదు చేసి తప్పుచేశారన్నారు. వితంతువులకు పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గిరిధర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సురేంద్రన్, ఏపీ అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు విజయ, సుజని, ధనకోటి, ప్రమీల, సరళ, కస్తూరి, లీలా పాల్గొన్నారు.
దళితులను వెలివేయాలని చూస్తున్నారు
దళితులను గ్రామం నుంచి వెలివేయాలని అగ్రకులస్తులు చూస్తున్నట్లు చిత్తూరు నగరం మాపాక్షి రెవెన్యూ ఉయ్యాలచింత గ్రామస్తులు జయ, పార్వతి, జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ గ్రామస్తులు కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ చిత్తూరు నగరం 13వ వార్డు లో సర్వే నెంబర్ 123 లో 30 ఏళ్ల నుంచి జీవిస్తున్నామన్నారు. తమకు ప్రభుత్వం రాస్తా పోరంబోకు స్థలంలో ఇంటి స్థలాలు మంజూరు చేసిందన్నారు. ఇటీవల కొందరు అగ్రకులస్తులు వచ్చి వెలివేయాలని చూస్తున్నారన్నారు.
స్మార్ట్ మీటర్లు వద్దు
రాష్ట్ర ప్రభుత్వం అదానీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యుత్ వినియోగదారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చైతన్య డిమాండ్ చేశారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లా డుతూ పేదలకు నష్టం జరిగే స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలన్నారు. ఆ సంఘం నాయకులు శ్రీనివాసమూర్తి, షౌకత్, మునస్వామి, రషీద్, రాజేంద్రన్ పాల్గొన్నారు.

ఇంకెన్ని సార్లు తిరగాలో..?

ఇంకెన్ని సార్లు తిరగాలో..?

ఇంకెన్ని సార్లు తిరగాలో..?

ఇంకెన్ని సార్లు తిరగాలో..?