
ఇది ముంచే ప్రభుత్వం
● నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు ● ఆయనకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య ● ‘5 కోట్ల మందికి వెన్నుపోటు’ పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి రోజా
నగరి : ‘కూటమి నాయకులు మాది మంచి ప్రభుత్వం అంటూ డప్పు కొట్టుకుంటుంటే.. ప్రజలు మాత్రం ఇది ముంచే ప్రభుత్వం అంటున్నారు’ అని మాజీ మంత్రి ఆర్కేరోజా ఎద్దేవా చేశారు. నగరి పట్టణంలోని తన నివాసంలో సోమవారం ‘5 కోట్లమందికి వెన్నుపోటు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రజాప్రతినిధులకు అందజేశారు. ఆమె మాట్లాడుతూ చంద్రబాబుకు అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటు పొడవడం అనేది వెన్నతో పెట్టిన విద్య అని ముక్త కంఠంతో జనం చెబుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఇస్తామని ఏడాదైనా సూపర్ సిక్స్ పథకాలు అమలు లేదన్నారు. నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ లేదు, ఉచిత బస్సు లేదు. 18 యేళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1500 లేదు, ఇప్పటి వరకు ప్రజలకు సెంటు భూమి ఇవ్వలేదని గుర్తుచేశారు. వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో జన తాకిడి చూసిన తర్వాత భయపడి తల్లికి వందనం హడావుడిగా విడుదల చేశారన్నారు. అది కూడా 87 లక్షల మందికి అందాల్సిన పథకం కేవలం 57 లక్షల మందికి మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఒకే ఆధార్ నెంబర్తో 349 మందికి, 54 మందికి, 92 మందికి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాల్లో చదివే విద్యార్థులను అనర్హత కింద పరిగణించారని విమర్శించారు. వైఎస్సార్సీపీ పాలనలో మరుగుదొడ్ల నిర్వహణకు రూ.వెయ్యి తీసుకుంటే రాద్ధాంతం చేసిన చంద్రబాబు, నేడు రెండు వేలు వసూలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మూలన ఉండే ముసలమ్మ కూడా బలన్ నొక్కుతుందన్న చంద్రబాబు ఒక్క బటన్ నొక్కడం కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టి..ఎల్లో మేనిఫెస్టో అమలు చేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ పెరిగిపోయాయని వాటిని అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్లు పీజీ నీలమేఘం, హరి, ఎంపీపీలు భార్గవి, మునివేలు, దీప, మున్సిపల్ వైస్ చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.