బడ్జెట్‌ 2023: కేంద్రం ఫోకస్‌ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా!

Union Budget 2023: Experts And Taxpayers Expected These Major Announcements - Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023-24ను సమర్పించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ సారి బడ్జెట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు పన్ను ప్రయోజనాల రూపంలో ప్రజలకు కొంత ఉపశమనాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం తన కేటాయింపులను ప్రణాళికాబద్దంగా ఖర‍్చు చేయనుంది, ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణాన్ని ఎలా నియంత్రిస్తుంది అనే దానిపై అందరి దృష్టి ఉంది. ఈ సారి బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనలు ఉండొచ్చని అటు ప్రజలతో పాటు నిపుణులు భావిస్తున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం!

పన్ను స్లాబ్‌
ప్రస్తుత పన్ను స్లాబ్‌లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ₹ 2.5 లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితి ఉంది. దీని అర్థం ఈ పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయవలసిన అవసరం లేదు. అయితే ఈ నిబంధనలో గత ఏడేళ్లగా ఎటువంటి మార్పులు చేయలేదు. దీంతో రాబోయే బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం ₹ 5 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు.

ప్రామాణిక తగ్గింపు(స్టాండర్డ్ డిడక్షన్‌)
ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను ₹ 50,000 నుంచి ₹ 1 లక్ష వరకు రెట్టింపు చేసే అవకాశం ఉందని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న జీవన వ్యయం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కోసం ప్రామాణిక మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని వాదన కూడా ఉంది.

ఆర్థిక లోటు తగ్గింపు
భారత్‌ తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించుకోవచ్చని గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ తెలిపింది. ఆండ్రూ టిల్టన్, శాంతాను సేన్‌గుప్తాతో సహా గోల్డ్‌మ్యాన్ ఆర్థికవేత్తలు భారతదేశం తన లోటును 5.9కి ఉంచుతుందని ఒక నివేదికలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయాన్ని కొనసాగిస్తూ సంక్షేమ వ్యయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ఉపాధి,  గృహనిర్మాణంపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

మౌలిక సదుపాయాలు, సామాజిక పథకాల వ్యయం
ఈ ఏడాది బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలపై ఖర్చు కూడా పెంచే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే రానున్న కాలంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బడ్జెట్‌ ఇదే కావడంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక రంగ సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: అప్పట్లో రియల్‌ ఎస్టేట్‌ కింగ్‌.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top