యుద్ధం ఆగకపోతే.. ఆ దేశాల్లో తిండికి కూడా కటకటే! | Ukraine Russia War : Live stock of Europe IN Danger | Sakshi
Sakshi News home page

పాపం మూగజీవాలు..యుద్ధం వల్ల మనుషులకే కాదు పశువులకు ఇబ్బందులే!

Mar 19 2022 2:06 PM | Updated on Mar 19 2022 3:23 PM

Ukraine Russia War : Live stock of Europe IN Danger - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దాడి రోజుల తరబడి కొనసాగుతుండటంతో ఇప్పుడా యుద్ధ ప్రభావం యూరప్‌ దేశాలపైకి పాకుతోంది. ఇప్పటి వరకు యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌, ఆ తర్వాత రష్యాలు ఎక్కువ ఇబ్బందులు పడగా ఇప్పుడు దక్షిణ యూరప్‌కి కష్టాలు మొదలయ్యాయి.

పాశ్చాత్య దేశాల్లో మాంసాహారానికి డిమాండ్‌ ఎక్కువ. అక్కడి ప్రజల ఆహార అలవాట్లలో చికెన్‌, మటన్‌, బీఫ్‌, పోర్క్‌లు చాలా కామన్‌. ఈ డిమాండ్‌కి తగ్గట్టుగా యూరప్‌లో స్పెయిన్‌ , ఇటలీ, సెర్బియా, హంగరీ, మాల్డోవా దేశాల్లో భారీ ఎత్తున కోల్లు, మేకలు, ఆవులు, ఎద్దులు, పందులు, గొర్రెల పెంపకం జరుగుతూ ఉంటుంది. లైవ్‌స్టాక్‌ని ఇక్కడ ఇండస్ట్రియల్‌ స్కేల్‌లో నిర్వహిస్తుంటారు.

లైవ్‌స్టాక్‌కి ఆహారంగా అందించే దినుసుల్లో మొక్కజొన్న గింజలు ప్రధానం, యూరప్‌ దేశాల్లోని లైవ్‌స్టాక్‌కి సరఫరా అయ్యే కార్న్‌లో సింహభాగం ఉక్రెయిన్‌ నుంచే సరఫరా అవుతుంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా దాదాపు నెలరోజులుగా ఉక్రెయిన్‌ ఓడరేవుల నుంచి షిప్‌లు కదలడం లేదు. మరోవైపు స్పెయిన్‌, ఇటలీ వంటి దేశాల్లో లైవ్‌స్టాక్‌కి సరిపడ తిండిగింజలు తగిరిపోతున్నాయి.

సుమారు 45 రోజలుకు సరిపడా తిండిగింజలు స్టాక్‌గా పెట్టుకోవడం పరిపాటి. యుద్ధం మొదలై ఇప్పటికే 20 రోజులు దాటి పోయాయి. మళ్లీ స్టాక్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో లైవ్‌స్టాక్‌ను మెయింటైన్‌ చేయలేక.. ఫార్మ్స్‌ యజమానులు వాటిని ఉన్న పళంగా కబేళాలకు తరలిస్తున్నారు. 

యూరప్‌లో అత్యధికంగా లైవ్‌స్టాక్‌ నిర్వహిస్తున్న దేశాల్లో స్పెయిన్‌ది ప్రథమ స్థానం. అక్కడ ఏకంగా 59 మిలియన్ల లైవ్‌స్టాక్‌ ఉంది. ఆ తర్వాత ఇటలీలో 22.50 మిలియన్ల లైవ్‌ స్టాక్‌ ఉంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు స్పెయిన్‌ తాత్కాలికంగా బ్రెజిల్‌, అర్జెంటీనాల నుంచి కార్న్‌ దిగుమతి చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇటలీ, సెర్బియా, హంగరీ వంటి దేశాలు లైవ్‌స్టాక్‌కి అవసరమైన కార్న్‌, ఇతర ఉత్పత్తుల కోసం దిక్కులు చూస్తున్నాయి.

మరో వారం పది రోజుల్లో యుద్ధం విషయంలో క్లారిటీ రాకపోతే పశువులను పెంచలేని పరిస్థితి నెలకొంటుందని.. అదే పరిస్థితి కనుకు వస్తే ఆఖరికి డెయిరీ పరిశ్రమలో ఉన్న పశువులను సైతం కబేళాలకు తరలించాల్సిన వస్తుందంటున్నారు అక్కడి లైవ్‌స్టాక్‌ ఫార్మ్‌ నిర్వాహకులు. డెయిరీ నుంచి పశువులు వధకు గురైతే.. తిరిగి సాధారణ పరిస్థితి వచ్చేందుకు ఆరేడేళ్లు పడుతుందని..అప్పటి వరకు సగం యూరప్‌ దేశాలకు పాల కొరత తప్పదంటున్నారు. ఇదే పరిస్థితి మాంసం ఉత్పత్తుల విషయంలోనూ చోటు చేసుకుంటుందని హెచ్చరిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement