
దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడంలో తెలంగాణ ప్రజలు ముందుంటున్నారని ఇన్సూరెన్స్ ఎవేర్నెస్ కమిటీ (ఐఏసీ–లైఫ్), ఐఎంఆర్బీ కాంటార్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దీని ప్రకారం రాష్ట్రంలో 94 శాతం మంది జీవితంలో తలెత్తే అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తుగా ప్రణాళికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
జీవిత బీమా అనేది పొదుపు, రక్షణ సాధనంగా ఉపయోగపడుతుందని రాష్ట్రంలో 100 శాతం అవగాహన ఉంది. వచ్చే 3 నెలల్లో జీవిత బీమా కొనాలని 38 శాతం మంది భావిస్తున్నారు. సబ్సే పెహ్లే లైఫ్ ఇన్సూరెన్స్ 2.0 ప్రచారానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఐఏసీ–లైఫ్ కో–చెయిర్పర్సన్ వెంకటాచలం ఈ విషయాలు తెలిపారు.
రాష్ట్రంలో టర్మ్, చైల్డ్, పొదుపు ప్లాన్లతో పాటు ఇతర బీమా పథకాల గురించి ప్రాంతీయంగా టీవీ, డిజిటల్ తదితర మాధ్యమాల ద్వారా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రచార కార్యక్రమాలను మరింతగా నిర్వహించనున్నట్లు వివరించారు.
అధ్యయనం ముఖ్యాంశాలు
94% మంది తెలంగాణ ప్రజలు అనూహ్య పరిస్థితులకు ముందుగానే ప్రణాళికలు వేసుకోవడం అలవాటు చేసుకున్నారు.100% అవగాహన జీవిత బీమా గురించి ఉంది — ఇది పొదుపు మరియు రక్షణ సాధనంగా ఉపయోగపడుతుందని ప్రజలు అర్థం చేసుకున్నారు.
38% మంది వచ్చే 3 నెలల్లో జీవిత బీమా కొనాలని భావిస్తున్నారు.
87% మంది పొదుపు ప్లాన్లను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇవి గ్యారంటీడ్ లంప్సమ్ లేదా నెలవారీ ఆదాయాన్ని అందించే ప్లాన్లు.
90% మంది టీవీ ద్వారా జీవిత బీమా గురించి తెలుసుకుంటే 56% మంది ఇన్సూరెన్స్ ఏజెంట్ల ద్వారా సమాచారం పొందారు.
84% మంది దీర్ఘకాలిక పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారు.
87% మంది త్వరగా రిటైర్ కావాలనే లక్ష్యంతో పొదుపు అలవాటు చేసుకుంటున్నారు. ఇది సర్వే చేసిన మెట్రో మార్కెట్లలో అత్యధిక శాతం.