
టాటా కార్ల ధరలు మరోసారి పెరగనున్నాయి. పెరుగుతున్న తయారీ ఖర్చులు, బీఎస్ నిబంధనల మార్పు కారణంగా పెరిగిన ఆర్థిక భారంతో టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. 2023లో కార్ల ధరలను పెంచడం ఇది రెండోసారి.
(Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...)
తమ ప్యాసింజర్ వాహనాల ధరల సగటు పెరుగుదల 0.6 శాతం ఉంటుందని టాటా మోటర్స్ పేర్కొంది. పెరిగే ధర కార్ మోడల్, వేరియంట్పై ఆధారపడి ఉంటుంది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ధరల పెంపు మే 1 నుంచి అమలులోకి వస్తుంది. 2023 సంవత్సరంలో టాటా మోటార్స్ ధరలను పెంచడం ఇది రెండవ సారి. అంతకుముందు జనవరిలో ధరలను 1.2 శాతం పెంచింది.
బీఎస్ 6 నిబంధనలను అమలు చేయడం వల్ల ఈ నెల ప్రారంభంలో దేశంలోని అన్ని కంపెనీల్లో అన్ని విభాగాలలో వాహనాల ధరలు పెరిగాయి. ఉద్గారాలను పర్యవేక్షించడానికి వాహన తయారీదారులు వాహనాలకు ప్రత్యేక పరికరాన్ని తప్పనిసరిగా అమర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా తయారీ ఖర్చు పెరిగింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో పలుమార్లు ధరలు పెరిగినప్పటికీ భారతదేశంలో అత్యధిక ప్యాసింజర్ కార్ల అమ్మకాలు నమోదయ్యాయి. పెద్ద కార్లు, ఖరీదైన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)కు అధిక డిమాండ్ కారణంగా అమ్మకాలు పెరిగాయి. టాటా మోటార్స్కు చెందిన నెక్సాన్, పంచ్ ఎస్యూవీలు 2022లో భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలిచాయి.