
సన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్ఎస్సిఎ) & బ్లూమ్ బెర్గ్ కలిసి నిర్వహించిన ఇన్ఫినిటీ ఫోరంలో ప్రముఖ జపాన్ సాఫ్ట్బ్యాంక్ చీఫ్ మసయొషి మాట్లాడుతూ.. భారత ఆర్థిక భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్కు మెరుగైన భవిష్యత్తు ఉందని, ఇక్కడి యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు బాగా రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ ఇప్పటివరకు భారతదేశంలో 14 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది అని అన్నారు.
సాఫ్ట్ బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారు అని, ఈ గ్రూప్ భారతదేశంలోని యూనికార్న్లకు కనీసం 10శాతం నిధులను సమకూర్చినట్లు తెలిపారు. సాఫ్ట్ బ్యాంక్ పోర్ట్ ఫోలియో గల సంస్థలు భారతదేశంలో ఒక మిలియన్ కొత్త ఉద్యోగాలను సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. "నేను రాబోయే భవిష్యత్తు భారతదేశానిదే అని నమ్ముతున్నాను. భారతదేశంలోని యువ వ్యవస్థాపకుల అభిరుచిని నేను విశ్వసిస్తాను. భారతదేశం గొప్ప ఉజ్వల భవిష్యత్తు ఉంది. భారత్లో ఉన్న యువ ఆవిష్కర్తలంతా ముందుకు రావాలని కోరుకుంటున్నాను, అందుకు తమ మద్దతు ఉంటుంది" అని ఆయన అన్నారు.
ఈ ఏడాది భారతీయ స్టార్ట్-అప్ కంపెనీలలో 3 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. గత నెలలో సాఫ్ట్ బ్యాంక్ ఇన్వెస్ట్ మెంట్ ఎడ్వైజర్స్ సీఈఓ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ.. సరైన వాల్యుయేషన్ వద్ద సరైన అవకాశాలు వస్తే వచ్చే ఏడాది భారతదేశంలో 10 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపారు. పేటీఎం, ఓలా, డెలివరీ, ఫ్లిప్కార్ట్, మీషో సహా పలు ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్బ్యాంక్ పెట్టుబడులు పెట్టింది.
(చదవండి: దేశంలో భారీగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ కంపెనీవే!)