నేడు మళ్లీ లాభాల ఓపెనింగ్‌?! | SGX Nifty indicates Market may open in Positive mode | Sakshi
Sakshi News home page

నేడు లాభాల ఓపెనింగ్‌?!

Sep 28 2020 8:30 AM | Updated on Sep 28 2020 8:32 AM

SGX Nifty indicates Market may open in Positive mode - Sakshi

నేడు(28న) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 79 పాయింట్లు ఎగసి 10,111 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 11,032 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. సుమారు 21 సెషన్ల తదుపరి వారాంతాన యూఎస్‌ మార్కెట్లు అత్యధికంగా అంటే 1.4-2.3 శాతం మధ్య ఎగశాయి. ప్రస్తుతం డోజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం సానుకూలంగా కదులుతోంది. దీంతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమయ్యే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే వరుస నష్టాల నుంచి ప్రపంచ మార్కెట్లు బయటపడినప్పటికీ అంతర్గతంగా సెంటిమెంటు బలహీనంగానే ఉన్నట్లు పేర్కొంటున్నారు. దీంతో మార్కెట్లలో ఆటుపోట్లు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. 

మార్కెట్ల పోల్‌వాల్ట్‌
ఆరు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లు అనూహ్య బౌన్స్‌బ్యాక్‌ను సాధించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీతో, నిఫ్టీ సెంచరీతోనూ ప్రారంభమయ్యాయి. ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడంతో ఆపై మరింత ఊపందుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ 835 పాయింట్లు దూసుకెళ్లి  37,389 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 245 పాయింట్లు జంప్‌చేసి 11,050 వద్ద స్థిరపడింది. వెరసి ఇంట్రాడే గరిష్టాలకు సమీపంలోనే మార్కెట్లు ముగిశాయి.  

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 10,912 పాయింట్ల వద్ద, తదుపరి 10,775 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,130 పాయింట్ల వద్ద, ఆపై 11,210 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 20,587 పాయింట్ల వద్ద, తదుపరి 20,192 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 21,221 పాయింట్ల వద్ద, తదుపరి 21,459 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,080 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,071 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1,886 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా..  డీఐఐలు స్వల్పంగా రూ. 189 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement