
ప్రముఖ కంపెనీల లాభాలు నేలచూపు
ప్రముఖ కంపెనీలు కొన్ని క్యూ4లో ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కానీ అనుకున్న విధంగా లాభాలు పోస్ట్ చేయలేకపోయాయి. సిమెంట్ తయారీ దిగ్గజం ఏసీసీ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. గతంలో ఈ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు వెలువడుతాయని అంచనా వేసినా లాభం లేకుండా పోయింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 20 శాతంపైగా క్షీణించి రూ.751 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ.943 కోట్లు ఆర్జించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ.7.5 డివిడెండ్ ప్రకటించింది. సిమెంట్ అమ్మకాల ఆదాయం మాత్రం 11 శాతం ఎగసి రూ. 5,686 కోట్లకు చేరింది. రెడీమిక్స్ కాంక్రీట్ ఆదాయం 32 శాతం జంప్చేసి రూ. 420 కోట్లను తాకింది. దీంతో మొత్తం టర్నోవర్ 12 శాతం మెరుగుపడి రూ. 6,067 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు 13 శాతం పెరిగి రూ. 5,515 కోట్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో అమ్మకాల పరిమాణం 14 శాతం పుంజుకుని 11.9 మిలియన్ టన్నులను తాకింది. వెరసి ఒక క్వార్టర్కు కంపెనీ చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు సాధించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 3 శాతం వృద్ధితో రూ. 2,402 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 12 శాతం బలపడి రూ. 22,835 కోట్లకు చేరింది.
ఇదీ చదవండి: ‘పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాం’
నెస్లే ఇండియా లాభం డౌన్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 6 శాతంపైగా క్షీణించి రూ. 873 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 934 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం వృద్ధితో రూ. 5,448 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 5,254 కోట్ల అమ్మకాలు సాధించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 10 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ.3,208 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2025 జులైలో పదవీ విరమణ చేయనున్న చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ స్థానే 2025 ఆగస్ట్ 1 నుంచి మనీష్ తివారీ ఎండీగా బాధ్యతలు చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు నెస్లే ఇండియా వెల్లడించింది.