న్యూఢిల్లీ: సౌర విద్యుదుత్పత్తికి దోహదపడే పరికరాల తయారీ సామర్థ్యాల విస్తరణపై వచ్చే మూడేళ్లలో రూ. 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రీమియర్ ఎనర్జీస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వినయ్ రుస్తగీ తెలిపారు. సమగ్ర సౌర ఉత్పత్తుల తయారీ సంస్థగా ఎదిగే క్రమంలో ఇన్గోట్, వేఫర్ల ఉత్పత్తి కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు చెప్పారు.
సెల్, మాడ్యూల్ సామర్థ్యాలను రెట్టింపు చేసుకోవడం, ఇన్వర్టర్లు, బ్యాటరీల్లాంటి కొత్త విభాగాల్లోకి ప్రవేశించడం కోసం తలపెట్టిన రూ. 12,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో ఇది భాగమని వినయ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని నాయుడుపేటలో 200 ఎకరాల్లో 10 గిగావాట్ ఇన్గోట్, 10 గిగావాట్ వేఫర్ల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.


