దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో జీవన వ్యయం ఎంత వేగంగా పెరుగుతోందో మరోసారి చర్చనీయాంశమైంది. భార్యాభర్త ఇద్దరూ కలిసి నెలకు రూ.2.2 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ నెలాఖరుకు చేతిలో డబ్బు మిగలడం లేదంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. తమ ఖర్చులను నియంత్రించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆర్థిక ప్రణాళికపై సూచనలు ఇవ్వాలని వారు కోరారు.
అద్దె, పెట్టుబడులు, ప్రయాణ ఖర్చులే భారమా?
రెడ్డిట్లో చేసిన పోస్టు ప్రకారం, ఈ దంపతులు ముంబైలో ఒక 1BHK ఫ్లాట్లో నివసిస్తున్నారు. నెలకు రూ.44 వేల అద్దె చెల్లిస్తున్నారు. కిరాణా సరుకులకు సుమారు రూ.20 వేల వరకు ఖర్చవుతుండగా, పనిమనిషి జీతం రూ.8 వేలు, విద్యుత్, ప్రయాణ ఖర్చులు కలిపి మరో రూ.10-12 వేల వరకు వెళ్తున్నాయి. వీటితో పాటు ప్రతి నెలా రూ.60 వేల మేర సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడి పెడుతున్నారు.
అంతేకాకుండా ఉద్యోగ సంబంధిత సామాజిక కార్యక్రమాలు, పార్టీలు, సమావేశాల కోసం నెలకు రూ.12 వేల నుంచి రూ.13 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. లెక్కల ప్రకారం ఇంకా సుమారు రూ.60 వేల వరకు మిగలాల్సి ఉన్నప్పటికీ, నెలాఖరుకు ఆ మొత్తం కూడా ఖర్చయిపోతోందని వారు పేర్కొన్నారు.
చిన్న చిన్న ఖర్చులే పెద్ద భారం
బట్టలు, వాచ్లు, పర్ఫ్యూమ్లు కొనడం వంటి వ్యక్తిగత ఖర్చులతో పాటు స్వగ్రామానికి వెళ్లి వచ్చేందుకు ప్రయాణాలపై కూడా భారీగా ఖర్చవుతోందని దంపతులు తెలిపారు. ఒక్కోసారి కుటుంబ సభ్యుల కోసం బహుమతులు, ఇతర అవసరాలతో కలిపి ఒక్కో ప్రయాణానికే రూ.45 వేల వరకు వెచ్చిస్తున్నామని వివరించారు.
భవిష్యత్తులో పిల్లలను కనాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఖర్చు విధానం దీర్ఘకాలంలో నిలకడగా ఉంటుందా అనే ఆందోళన కూడా వ్యక్తం చేశారు.
“సిప్ కూడా పొదుపే”.. నెటిజన్ల సలహాలు
ఈ పోస్టుపై స్పందించిన పలువురు నెటిజన్లు, నెలకు రూ.60 వేలు సిప్లో పెట్టుబడి పెడుతున్నారు కదా దీన్ని కూడా పొదుపుగా పరిగణించాలని సూచించారు. రోజువారీ ఖర్చులను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురైతే సిప్ చేసే మొత్తాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
మరికొందరు అసలు సమస్య ఆదాయం తక్కువగా ఉండటంలో కాదని, ఖర్చుల నియంత్రణలోనే ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆఫీస్ పార్టీల పేరుతో ప్రతి నెలా రూ.12-13 వేల వ్యయం చేయడం, అవసరం లేని కొనుగోళ్లు, తరచూ ఖరీదైన ప్రయాణాలు చేయడం వంటి అంశాలను తగ్గిస్తే పొదుపు పెరుగుతుందని సూచించారు.
మెట్రో నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయం
ఇటీవలి సంవత్సరాల్లో ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో అద్దెలు, రవాణా, తిండి, సేవల ఖర్చులు గణనీయంగా పెరిగాయి. దీంతో మంచి వేతనాలు పొందుతున్న మధ్యతరగతి ఉద్యోగులు సైతం ఆర్థిక ప్రణాళిక, ఖర్చుల నియంత్రణ, పెట్టుబడుల సమతుల్యతపై మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ముంబై దంపతుల పోస్ట్ నగర జీవనశైలిపై, ఆదాయం-ఖర్చుల సమతుల్యతపై విస్తృత చర్చకు దారితీసింది.


