భారత్‌ బ్యాంకింగ్‌.. భేష్‌

Moodys maintains stable outlook on Indian banks - Sakshi

స్టేబుల్‌ అవుట్‌లుక్‌ను కొనసాగించిన మూడీస్‌

ఆర్థికాభివృద్ధి, ఫైనాన్షియల్స్‌ మెరుగుదల కారణం  

న్యూఢిల్లీ: భారత్‌ బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించి ‘స్థిర’ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ బుధవారం పేర్కొంది. ఆర్థిక వృద్ధి, మెరుగైన ఫైనాన్షియల్‌ పరిస్థితులు ఇందుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ‘మార్చితో ముగిసే 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కొంత తగ్గుతుందని భావిస్తున్న విషయం వాస్తవం. అయితే దేశ వృద్ధికి సంబంధించి పరిస్థితులు, ఫండమెంటల్స్‌ అన్నీ పటిష్టంగా ఉన్నాయి. ఆయా అంశాలు బ్యాంకింగ్‌ రుణ వృద్ధికి, రుణ నాణ్యతకు దోహదపడతాయి’’ అని మూడీస్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...

► చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్‌ఎంఈ)కు సంబంధించి బ్యాంకుల రుణ నాణ్యత కొంత ఇబ్బందుల్లోనే ఉంది. వడ్డీరేట్లలో పెరుగుదల దీనికి కారణం.  
► అయితే మొత్తంగా చూస్తే, రుణ నాణ్యత స్థిరంగా ఉంది. మొండిబకాయిలు (ఎన్‌పీఎల్‌) నిష్పత్తులు స్వల్పంగా తగ్గాయి. రికవరీలు, ఎప్పటినుంచో పేరుకుపోయిన రుణాల రైటాఫ్‌లు దీనికి కారణం.  
► బ్యాంకుల లాభదాయకత గత కొన్నేళ్లుగా మెరుగుపడింది.  రుణ–నష్టాల కేటాయింపులు (ప్రొవిజనింగ్స్‌) కూడా తగ్గుముఖం పడుతున్నాయి. బ్యాంకుల మూలధనం, నిధులు, లిక్విడిటీ (ద్రవ్య లభ్యత, సరఫరాలు) పరిస్థితులు స్థిరంగా ఉన్నాయి. ఆయా అంశాలు రుణ వృద్ధికి సైతం మద్దతును ఇస్తున్నాయి.  
► అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్‌ వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది.  బ్యాంకింగ్‌కు స్టేబుల్‌ అవుట్‌లుక్‌ కొనసాగించడానికి ఇది కూడా ఒక కారణం. 2023–24లో భారత్‌ జీడీపీ వృద్ధి 5.5 శాతంగా, 2024–2025లో 6.5 శాతంగా నమోదవుతుందని భావిస్తున్నాం.  
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా (ఆర్‌బీఐ) అంచనాలు వేస్తున్నప్పటికీ, క్లిష్ట, అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో ఇది తగిన వృద్ధి రేటే. దీనికి దేశీయ వినియోగ డిమాండ్, ప్రభుత్వ మూలధన వ్యయాలు మద్దతును ఇస్తున్నాయి.  
► ప్రైవేట్‌ కార్పొరేట్ల నుంచి కూడా రుణ డిమాండ్‌ బలంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. ద్రవ్యోల్బ ణం వంటి క్లిష్ట అంశాలు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలను పెంచడం, కంపెనీలు తమ ఫైనాన్సింగ్‌ అవసరాలను తక్కువ వ్యయాలతో తీర్చుకోవడానికి దేశీయ బ్యాంకుల వైపు మొగ్గు చూపడం వంటి అంశాలు ఈ అంచనాలకు కారణం.

వృద్ధి అంచనా పెంపు
2023–24  భారత్‌ అంచనాలను కిత్రం 4.8 శాతం నుంచి 5.5 శాతానికి పెంచుతున్నట్లు మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ప్రకటించింది. కేంద్ర బడ్జెట్‌లో మూలధన కేటాయింపుల పెంపు (2022–23లో రూ.7.5 లక్షల కోట్లుగా ఉన్న మొత్తాలను రూ.10 లక్షల కోట్లకు పెంపు. జీడీపీలో 3.3 శాతం) దీనికి కారణం. అయితే 2022–23కు సంబంధించి తన అంచనాలను 7 శాతం నుంచి (నవంబర్‌లో అంచనా) 6.8 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. 2024–25 లో వృద్ధి అంచనాలను 6.5 శాతంగా తన గత తాజా గ్లోబల్‌ మ్యాక్రో అవుట్‌లుక్‌లో పేర్కొంది.

జీ20 దేశాల పురోగతి ఇలా...
ఇక జీ20 దేశాల వృద్ధి 2022లో 2.7 శాతంగా ఉంటే, 2023లో 2 శాతానికి తగ్గుతుందని మూడీస్‌ అంచనావేసింది. అయితే 2024లో 2.4 శాతానికి మెరుగవుతుందని తెలిపింది. చైనాకు సంబంధించి వృద్ధి రేటు 2022ల 3 శాతం ఉంటే, 2023లో 5 శాతానికి మెరుగుపడుతుందని తెలిపింది. దీని ప్రకారం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను భారత్‌ కొనసాగిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top