ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) భయాలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్స్లో అమ్మకాలు వెల్లువెత్తడమనేది ఇన్వెస్టర్ల ’ఓవర్రియాక్షన్’ అని డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ సీఎండీ సంజీవ్ పురి వ్యాఖ్యానించారు. తమ సంస్థ విషయానికొస్తే ఉత్పాదకత, సామర్థ్యాలను పెంచుకునేందుకు ఏఐని వినియోగించుకుంటున్నట్లు చెప్పారు.
గతంలో ఉన్న సాధనాలతో తయారీ, సరఫరా వ్యవస్థ మొదలైన విభాగాల్లో పరిష్కరించలేకపోయిన సమస్యలను కూడా ప్రస్తుత సాంకేతికతతో పరిష్కరించగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయోత్పత్తుల విభాగానికి సంబంధించి పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావాలను మదింపు చేసేందుకు గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పులను టెక్నాలజీతో అధ్యయనం చేస్తున్నట్లు పురి చెప్పారు.
వ్యాపార ప్రణాళికల విషయానికొస్తే మధ్యకాలికంగా రూ. 20,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ఉన్నట్లు తెలిపారు. గతంలోలాగానే ఇతర సంస్థల కొనుగోలు అవకాశాలను కూడా పరిశీలిస్తుందని వివరించారు.


