చౌక ధరలకే ఆకాశయానం... వీళ్లేదే ఆ ప్లాన్‌

Important Persons Behind Rakesh Jhunjhunwala Akasa Airline  venture - Sakshi

ముంబై: ఇండియాలో విమానయానం సామాన్యులకు ఎప్పుడు అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. గతంలో తక్కువ ధరలకే ఎయిర్‌ డెక​‍్కన్‌ వచ్చినా ఎక్కువ కాలం మనుగడ సాగించలేక పోయింది. తాజాగా తక్కువ ధరకే విమాన సర్వీసులు అందిస్తామంటూ ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఆకాశ  విమానయాన సంస్థ నెలకొల్పారు.

ఆకాశ
ఆకాశ పేరుతో రాబోయే కొద్ది రోజుల్లోనే ఎయిర్‌ సర్వీసులు ప్రారంభించేందుకు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా రెడీ అయ్యారు. మార్కెట్‌ నిపుణుడైన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకు ఎయిర్‌లైన్స్‌లో ఉన్న అనుభవం ఎంత ? అయన ఈ రంగంలోకి అడుగు పెట్టేందుకు అండగా నిలబడింది ఎవరు? తనకు అందుబాటులో ఉండే ధరలతోనే కామన్‌ మ్యాన్‌ ఆకాశయనం చేయడం సాధ్యమవుతుందా అనే సందేహాలు మార్కెట్‌లో నెలకొన్నాయి. అయితే ఆకాశ స్థాపన వెనుక మార్కెట్‌ బిగ్‌బుల్‌ రాకేశ్‌తో ఎయిల్‌లైన్స్‌లో అపాన అనుభవం ఉన్న  మాస్టర్‌ మైండ్స్‌ ఉన్నాయి. 

వీరిద్దరే
స్టాక్‌మార్కెట్‌ ఇన్వెస్ట్‌ చేసి లక్షల కోట్లు సంపాదించి మార్కెట్‌ బిగ్‌బుల్‌గా పేరుపడిన  రాకేశ్‌ఝున్‌ఝున్‌వాలాకి ఎయిర్‌లైన్స్‌ ఇండస్ట్రీలో పట్టులేదు. కానీ ఆ రంగంలో అపార అనుభవం ఉన్న  వినయ్‌ దుబే, ఆదిత్యాఘోష్‌లు రాకేశ్‌కు కుడిఎడమలుగా నిలబడ్డారు. వారిద్దరే రెక్కలుగా మారి రాకేశ్‌ చేత ఆకాశయానం చేయిస్తున్నారు. 

వినయ్‌దుబే
ఆకాశ ఎ​యిర్‌వేస్‌ ఆలోచన పురుడుపోసుకోవడానికి ప్రధాన కారణం  జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ సీఈవో వినయ్‌ దుబే. ఎయిర్‌ ఇండియాకు పోటీగా ఎదిగిన జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవోగా వినయ్‌ దుబే పని చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి.. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాతో కలిసి ఆకాశకు బీజం వేశారు. ఆకాశలో వినయ్‌ దుబేకి 15 శాతం వాటా ఉంది.

ఆదిత్యా ఘోష్‌
చౌక విమాన సర్రీసులు అందించిన గో ఎయిర్‌లో 2008లో ఆదిత్య ఘోష్‌ చేరారు. అప్పటి నుంచి 2018లో కంపెనీని వీడేవరకు వివిధ హోదాల్లో రకరకాల స్కీమ్‌లు అమలు చేస్తూ గో ఎయిర్‌ అభివృద్దికి తోడ్పడ్డారు. ఇప్పుడు 160 విమానాలతో దేశంలోనే ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ కంపెనీగా గో ఎయిర్‌ కొనసాగుతోంది. ఈయన ఆకాశ ఎయిర్‌లైన్స్‌లో 10 శాతం వాటాను కలిగి ఉన్నారు.

ర్యాన్‌ఎయిర్‌ తరహాలో
ప్రపంచంలోనే అత్యంత చౌక ధరలకే విమానయానం అందిస్తామని ఆకాశ హామీ ఇస్తోంది. ఆగష్టు చివరి నాటికి ప్రభుత్వం నుంచి అనుమతలు వచ్చే అవకాశం ఉంది. యూరప్‌కి చెందిన ‘ర్యాన్‌ఎయిర్‌’ తరహాలో ఆకాశ ఎయిర్‌లైన్స్‌ సర్వీసెస్‌ ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ద్వితీయ శ్రేణి నగరాల్లో
ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఉదాన్‌ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. చిన్న నగరాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తోంది, కొత్తగా అనుమతులు మంజూరు చేస్తోంది. దీంతో భవిష్యత్తులో ఎయిర్‌లైన్‌ సర్వీసులకు డిమాండ్‌ పెరుగుతందనే అంచనాలు ఉన్నాయి,. ఈ నేపథ్యంలో 70 ఫ్లైట్లలతో ఆకాశ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top